రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ అరటి పండ్లు పచ్చగా నిగనిగలాడుతూ కనువిందు చేస్తుంటాయి!! కానీ వాటి తొడిమలు ఆకుపచ్చగా ఉంటాయి. తింటేగానీ అవి ఇంకా పండలేదని తెలియదు. పచ్చి కాయలను పండ్లుగా కనిపించేలా చేసే ఆ మాయ పేరు – కాల్షియం కార్బైడ్! నిగనిగల విషంతో మాగబెట్టిన పండ్లు తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయం. అందుకే కార్బైడ్ వినియోగాన్ని అరికట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది! రాష్ట్ర సర్కారు అలాంటివారిపై ఉక్కుపాదం మోపేలా జీవో కూడా జారీ చేసింది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ సీజన్ కోసం ఎదురు చూసే వారికి ఈ ఏడాది కూడా చేదు రుచి చూడక తప్పడం లేదు.
కాలుష్య కార్బైడ్ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. అయితే వ్యాపారులు రూట్ మార్చారు. కార్బైడ్కు బదులుగా మరో రసాయన పౌడర్ బాట పట్టారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు డబ్బే ధ్యేయంగా త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు ఇథలిన్ పౌడర్ను వినియోగిస్తున్నారు. కాలుష్య కారకమైన పౌడర్ అని తెలిసికూడా యథేచ్ఛగా కాయలను పండ్లుగా మగ్గిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కార్బైడ్ పండ్లతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వాంతులు, నీళ్ల వీరేచనాలు, రక్తంతో కూడిన జిగట విరేచనాలు, కడుపులో, ఛాతీలో మంట, విపరీతమైన దాహం, నీరసం, కళ్లలో దురద, మంట, చర్మంపై పుండ్లు, నోరు, ముక్కు,గొంతు లో దురద, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సరిగా అందకపోవడం.
ప్రకృతి సిద్ధంగా మామిడి కాయలను చెట్టుపైనే పక్వానికి వచ్చే వరకు ఉంచినట్లుయితే సహజ సిద్ధమైన తీపిగా ఉంటాయి. కానీ, నేటి పరిస్థితుల్లో పక్వానికి రాకుండానే చెట్టు నుంచి తెంచి మార్కెట్కు తరలిస్తున్నారు. మామిడి కాయల రుచిలో తేడాలు వస్తున్నాయి. గతంలో మామిడి కాయలుగా సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తేచ్చే పద్ధతులు పాటించేవారు. దీని వల్ల రుచిలో ఎలాంటి తేడా లేకుండా మామిడి మధుర తీపిని ప్రజలు రుచి చూసేవారు. కానీ, నేడు బట్టీల ద్వారా కాకుండా రసాయనాలతో కృతిమ పద్ధతులు అవలంభించడం ద్వారా అవి విషపూరితంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మామిడి పండ్లు పసుపురంగులో నిగనిగలాడుతు కనిపించినా రసాయన ప్రభావంతో సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కృత్తిమ పద్ధతిలో రసాయనాల ద్వారా మగ్గించిన పండ్లను తినడం మూలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.