ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య తయారు చేస్తోన్న కరోనా మందు ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు. కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. ఆనందయ్య మందు అంటూ మార్కెట్లోకి వచ్చేసిన నకిలీ మందులపై ఆనందయ్యకి కోపమొచ్చింది. నకిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాను తయారు చేసిన కరోనా మందు అన్ని ప్రాంతాలకూ చేరిందన్నారు.
నకిలీలకు చెక్ పెట్టేందుకు, దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లకు సకాలంలో సప్లై చేసేందుకు ఆనందయ్య కొత్త పద్ధతి అవలంబిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయుర్వేదం మందుని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చేతితోనే ప్యాకింగ్ చేసేవారు. అయితే ప్రస్తుతం రేగుపండు గుజ్జుని తయారుచేసి, ప్యాక్ చేసే ప్లాంట్ ని ఆయన కొనుగోలు చేశరని తెలుస్తోంది. ఆనందయ్య ఇస్తున్న కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ మాత్రమే మార్కెట్లో బాగా పాపులర్ అవుతోంది. పంపిణీకి సహకరించిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆనందయ్య అన్నారు.
కొంతమంది దొరికిన ఆకులు అలుములు వేసి లేహ్యాలు తయారు చేసి, అందులో కాసింత తేనె కలిపి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి జనాలకు ఇస్తున్నారు. ఇది నిజంగా ఆనందయ్య తయారు చేసిన మందుగానే భావించి చాలామంది మోసపోతున్నారు.