బిచ్చగాళ్ళ స్థలాన్ని ఖాళీచేస్తుంటే లక్షలు కనబడ్డాయి. 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్ సుఖ్దేశ్ సింగ్ సమ్యాల్ చెప్పారు. డబ్బు దాచుకున్న యాచకురాలు ఎవరో తెలియదని పేర్కొన్నారు. మున్సిపల్ కమిటీ స్థలాన్ని ఖాళీ చేయిస్తుండగా సంచుల్లో నోట్లు, నాణేలు దొరికాయని అన్నారు. మొత్తం లెక్కించగా రూ.2,58,507 ఉన్నట్లు అధికారులు తేల్చారు. డబ్బును యాచకురాలికే చేరేలా చూస్తామని సుఖ్దేశ్ చెప్పారు. నిజాయతీతో వ్యవహరించిన మున్సిపల్ కమిటీని అభినందించారు. యాచకురాలిని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లిన తరువాత, ఆమె వస్తులు, దుస్తులు శుభ్రం చేస్తుండగా పాలిథిన్ కవర్లతో గట్టిగా కట్టబడిన మూడు ప్లాస్టిక్ బాక్స్లు కనిపించాయి. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది. అందులో నోట్లతో పాటు భారీ మొత్తంలో చిల్లర ఉంది.
అధికారుల సమక్షంలో వీటిని లెక్కించగా రూ. 2,58,507 ఉన్నాయని సమ్యాల్ తెలిపారు. ఈ సొమ్మును తిరిగి ఆమెకే అప్పగిస్తామని ఆయన తెలిపారు. బిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న మహిళ తనకు వచ్చిన డబ్బును ప్లాస్టిక్ బాక్స్లో దాచుకుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఆమె ఎవరు అనేది గుర్తించడానికి కావాల్సిన సమాచారం తెలియడం లేదని, ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు కూడా లేవని అధికారులు తెలిపారు. గత 30 ఏళ్లుగా వెటర్నరీ హాస్పిటల్, బస్స్టాండ్ పరిసరాల్లో తిరుగుతోందని అధికారులు తెలిపారు.