కమెడియన్ యాదమ్మ రాజు, స్టెల్లా నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఒకటవ్వబోతున్నారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు యాదమ్మ రాజు. త్వరలోనే ఒక ఇంటి వాడు అవుతున్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తోటి కమెడియన్లు, నెటిజన్లు కూడా యాదమ్మ రాజుకి అభినందనలు తెలియజేశారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కానీ కొంతమంది అదే పనిగా యాదమ్మ రాజుని టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సిగ్గు లేదురా నీకు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగింది? యాదమ్మ రాజు చేసిన తప్పేంటి?
నిశ్చితార్థం ఫోటోల్లో యాదమ్మ రాజుకి గానీ, స్టెల్లాకి గానీ బొట్టు లేదు. స్టెల్లా క్రైస్తవురాలు, యాదమ్మ రాజు హిందువు. అయితే ఏ కారణంగా బొట్టు పెట్టుకోలేదో తెలియదు. అయినా బొట్టు పెట్టుకోవాలా? లేదా? అనేది వారి వ్యక్తిగత విషయం. అయితే కొంతమంది పర్సనల్ గా తీసుకుంటున్నారు. “మొత్తానికి తల్లిదండ్రుల పుట్టు పూర్వోత్తరాలు, వారి సాంప్రదాయాలు అన్నీ గాలికి వదిలేసి.. కేవలం ఒక ఆడదాని కోసం మతం మారినవ్” అని ఒకరు కామెంట్ చేయగా.. “ముఖానికి ఇంత బొట్టు కూడా లేదు రాజుగా.సిగ్గు లేదు నీకు” అంటూ మరొకరు యాదమ్మ రాజు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇలా దారుణంగా కామెంట్స్ చేశారు. ప్రేమించుకున్న వాళ్ళు బానే ఉన్నారు. మతాలు వేరైనా ప్రేమించుకుని ఒక్కటవుతున్నారు. పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కత్తి పీటకి లేని దురద కందకు ఎందుకని అన్నట్టు.. వాళ్ళ ఇంట్లో పెద్దలకు లేని అభ్యంతరం వీళ్ళకి ఎందుకంట? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అబిప్రాయమేంటో కామెంట్ చేయండి.