ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనకు సకాలంలో వెంటిలేటర్ లభించలేదని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా తులగం గ్రామంలో జన్మించిన ఆనంద్ పూర్తి పేరు గేదల ఆనందరావు. తల్లి అమ్మన్నమ్మ, తండ్రి చంద్రశేఖరం నాయుడు. ఆనంద్ తండ్రి రంగస్థల నటుడు. ఆయన రాముడి పాత్ర పోషిస్తే, ఆనంద్, అతని సోదరుడు లవకుశులుగా నటించేవారు. బాల్యం నుంచే పాటలు పాడటం అలవాటైన ఆనంద్, అనేక పోటీల్లో బహుమతులు సంపాదించుకున్నారు. యుక్త వయసులో ఆనంద్ పాల్గొన్న ఓ పాటల పోటీకి ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్, గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు. అందులో ఆనంద్కు ప్రథమ బహుమతి లభించింది. ఆనంద్ గాత్రాన్ని మెచ్చి మహదేవన్ చెన్నరుకి ఆహ్వానించడంతో ఆయన శ్రీకాకుళం నుంచి చెన్నపట్నం చేరారు. నటుడు చంద్రమోహన్ ద్వారా ప్రముఖ నిర్మాత ‘నవత’ కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడటంతో ‘అమెరికా అమ్మాయి’లో ‘ఒక వేణువు వినిపించెను’ గీతం పాడే అవకాశం వచ్చింది. ఈ చిత్రం విజయం సాధించడంతో చక్రవర్తి తాను సంగీతం సమకూర్చిన కల్పన, ఆమె కథ చిత్రాల్లో ఆనంద్ చేత పాటలు పాడించారు.
‘ప్రాణం ఖరీదు’, ‘మనవూరి పాండవులు’, ‘మా బంగారక్క’, ‘చక్రధారి’, ‘తాయారమ్మ -బంగారయ్య’ తదితర చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. ‘అమెరికా అమ్మాయి’ చిత్రంలో కథానాయికకు డబ్బింగ్ చెప్పిన సుజాతను ఆయన వివాహం చేసుకున్నారు. స్వరమాధురి సంస్థ ద్వారా దేశ విదేశాల్లో 6, 500లకు పైగా సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. వారి పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. ‘గాంధీనగర్ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే పలు సీరియల్స్ కు కూడా నేపధ్యసంగీతం అందించారు ఆనంద్. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నటుడు చిరంజీవి ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియచేశారు.