గద్దర్ ఇది పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. ఈయన తన జీవితం మొత్తాన్ని ప్రజల కోసమే అంకితం చేశారు. సామాజిక సమస్యల మీద తన పాటలతో పోరాటాన్ని సాగించారు.
అక్షరం, అక్షరం కలిస్తే పదం.. అది గొంతులోంచి పాట రూపంలో వస్తే జనమంతా తొక్కుతారు కదం. పాటకు ఉన్న శక్తి అది. నిద్రపోయిన వారిని తట్టి నిద్ర లేపుతుంది, అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, ఎదిరిస్తుంది, నిలదీస్తుంది. జనాన్ని జాగృతం చేస్తుంది. ఒక పాటకే అంత శక్తి ఉంటే.. జనం నుంచి జనం కోసం పుట్టిన మనిషి గుండెల్లోతుల్లోంచి వచ్చిన పాటకు ఇంకెంత శక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ పాటే శత్రువుల గుండెల్లో దూసుకుపోయే తుపాకీ తూటా. ఆ గొంతే గద్దర్, కోట్లాది జనాల గొంతు ఈ గద్దర్. కలమే గద్దర్ ఆయుధం.. అక్షరమే తుపాకీ తూటా. తుపాకీ తూటాల్లాంటి అక్షర సాహిత్యంతో అప్పటి నైజాం నవాబుల గుండెల్లో వణుకు పుట్టించారు. నాటి నుంచి ఆఖరి శ్వాస వరకూ పాటలతోనే సహజీవనం చేశారు. ఆయన ఎన్నో పాటలు పాడారు. వాటిలో విపరీతమైన జనాదరణ పొందిన 10 ఉత్తమ పాటల జాబితా మీ కోసం.
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె వస్తవ్ నైజాము సర్కరోడా.. నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా ‘ అంటూ సాగే ఈ పాట ఇప్పటికీ సింహగర్జనే. 1979లో వచ్చిన ‘మా భూమి’ సినిమాలోని పాట. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది. అప్పటి జనాలు టేప్ రికార్డర్ లో మళ్ళీ మళ్ళీ ఈ పాట వినేవారు. ఒకసారి మీరు కూడా వింటే పదే పదే వింటారు. అంత గొప్పగా ఉంటుంది.
‘మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అంటూ సాగే ఈ పాట ఇప్పటికీ ఒక సంచలనమే. 1995లో ఒరేయ్ రిక్షా సినిమా కోసం గద్దర్ స్వయంగా రాసిన పాట ఇది. ఈ పాటకు లిరిక్ రైటర్ కేటగిరీలో ఉత్తమ లిరిక్ రైటర్ గా గద్దర్ కు నంది అవార్డు వరించింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడగా.. ఆర్. నారాయణమూర్తి ఈ పాటకి శరీరంగా నిలిచారు.
‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా’ అంటూ సాగే ఈ పాట పెత్తందారులు, దొరలు, రాజులు వేసిన బానిస సంకెళ్లను తెంచుకుందాం అని అందరిలో తెగింపుని కల్గించింది. ఈ పాటను ఈయనే పాడారు. ఈ పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డు అనుకున్నారు. ఈ పాట జై బోలో తెలంగాణ సినిమాలోది.
భద్రం కొడుకో.. కొడుకో కొమురన్న జరా.. పైలం కొడుకో కొమురన్న జరా.. అంటూ గద్దర్ పాడుతుంటే రక్తం ఉరుకుతున్నట్టు ఉంటుంది. 1983లో వచ్చిన రంగుల కల సినిమాలోనిది ఈ పాట. పల్లె నుంచి పట్నానికి వలస వచ్చిన రిక్షా కార్మికులకు దిశా నిర్దేశం చేస్తూ పాడిన ఈ పాటకు అప్పట్లో ఒక సంచలనం.
ఇది గద్దర్ కలం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడ్డ మరో ప్రళయ గీతం. అమ్మ తెలంగాణమా.. ఆకలి కేకల గానమా అంటూ సాగే ఈ పాట తెలంగాణ ప్రజల ఆకలి కేకలను గుర్తు చేస్తుంది. గద్దర్ రాసిన, పాడిన పాటల్లో ఈ పాట కూడా ప్రత్యేకమే.
పొద్దు తిరుగుడు పువ్వు.. అడవిలో వెన్నెలమ్మ అంటూ అడవి తల్లి నేపథ్యంతో పాడిన పాటలో ఎంతో అర్థం ఉంది. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే.. అడవిలో వెన్నెలమ్మ ఆకులను ముద్దాడే.. పిల్లయేరు పారు తల్లిని ముద్దాడే .. సంద్రమమ్మ పొంగి నింగిని ముద్దాడే.. పొత్తిలో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే.. పాల సేపులను పాపలు ముద్దాడే.. ఆడి ఆడి అలసిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, మూగబోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే, యుద్దములో భలే భలే యోధున్ని తుపాకి ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరుడ్ని భూతల్లి ముద్దాడే, రణతల్లి ముద్దాడే అంటూ సాగే ఈ పాటలో మొత్తం సృష్టి చక్రమే ఉంది.
గిచ్చన్న గిరి మల్లెలో అంటూ తెలంగాణలోని అన్ని జిల్లాల నదుల పోకడను, లంచగొండుల అవినీతిని, అంటరానితనం, అసమానతలను నిలదీస్తూ రాసిన ఈ పాట గద్దర్ కు ఎంతో ఖ్యాతిని సంపాదించిపెట్టింది.
2016 లో వచ్చిన దండకారణ్యం సినిమాలోనిది ఈ పాట. ఈ పాట ఈయనే స్వయంగా రాసి పాడారు.
‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు’ అంటూ సాగే ఈ పాట అప్పటి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన జ్వాలను రగిలించింది. ఈ పాట 1995 లో వచ్చిన ఒరేయ్ రిక్షా సినిమాలోది.
మేలుకో రైతన్న అంటూ సాగే ఈ పాట 2019లో వచ్చిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలోది.