కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కొన్ని వందల మంది నెలల పాటు కష్టపడి పని చేస్తే.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగల ఓ సినిమా తెరకెక్కుతుంది. హిట్టా ఫ్లాపా అన్న సంగతి పక్కకు పెడితే.. సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేవరకు ఆ మూవీ కోసం పని చేసేవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పైరసీ భూతం కాటేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు విడుదల కాకుండానే వాటిల్లోని పలు సన్నివేశాలు లీక్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఒక్కసారి సినిమా థియేటర్లో రిలీజ్ అయిందంటే చాలు.. సాయంత్రానికి కొన్ని వెబ్సైట్లలో పైరసీ కాపీ రెడీగా ఉంటుంది. నిర్మాతలు, హీరోలు, దర్శకులు పైరసీకి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ క్రమంలో తాజాగా పైరసీ భూతాన్ని అరికట్టడానికి ఏకంగా కోర్టును ఆశ్రయించారు ఓ చిత్ర బృందం. వారి వాదనలు విన్న కోర్టు.. పైరసీ సైట్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
చియాన్ విక్రమ్ హీరోగా కోబ్రా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత పైరసీ భూతం నుంచి తన సినిమాను రక్షించుకోవడం కోసం 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సోషల్ మీడియా సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కోర్టు ఈ కేసును విచారించింది.
ఈ సందర్భంగా నిర్మాత తరఫున లాయర్ మాట్లాడుతూ.. కొన్ని నెలల పాటు కష్టపడి శ్రమించి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే.. కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని.. ఫలితంగా ఇండస్ట్రీ జనాలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టుకు తెలిపారు. ఈ పైరసీ వల్ల ఎంతోమంది సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా ఆయా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు.
కోబ్రా నిర్మాత తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి ఆ సినిమాను చట్ట విరుద్ధంగా వెబ్సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై చిత్ర బృందం హర్షం వ్య్తక్తం చేసింది.
ఇక కోబ్రా సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిగా.. మూవీలో ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్గా చేశారు నటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. బుధవారం (ఆగస్టు 31) వినాయక చవితి సందర్బంగా సినిమా విడుదల కానుంది.