ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల శుభకార్యాలను కూడా ఆన్లైన్లో నిర్విహిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏళ్ల తరబడి కలలుగన్న తల్లిదండ్రుల ఆశలు కరోనా కారణంగా ఆవిరయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండటంతో శుభకార్యాలను కూడా అత్యంత జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. పెళ్లిని కూడా మాస్కులు ధరించి చేసుకోవాల్సి వస్తోంది.
అయితే కరోనా కేసుల తీవ్రత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12 నుంచి 22 వరకు లాక్డౌన్ విధించడంతో శుభకార్యాలకు సిద్ధమైనవారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో కొంతమంది పెళ్లిళ్లను వాయిదా వేసుకోగా, మరికొంతమంది తక్కువ మందితో శుభకార్యాలను పూర్తి చేసుకుంటున్నారు. అయితే పలుచోట్ల ఒకరిద్దరు పూజారులు మాస్కులు, ఫేస్షీల్డులు, చేతులకు గ్లౌజులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యక్షంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ 90% మంది ఇంటినుంచే వీడియోకాల్ ద్వారా చేస్తున్నారు.
శుభకార్యాలు చేయాల ని ఎవరైనా ఫోన్ ద్వారా సంప్రదిస్తే అందుకు సంబంధించి పూజాసామగ్రి జాబితాను పూజా రులు ఫోన్లోనే చెబుతున్నారు. ముహూర్త సమయానికి గంట ముందు కాల్ చేస్తే తాము వీడియోకాల్లో సిద్ధంగా ఉంటామని చెబుతున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ఫోన్పే, గూగు ల్ పే ద్వారా సంభావనలు స్వీకరిస్తున్నారు.
ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని, వీటికోసం చాలామంది చాలారోజులుగా ఎదురుచూస్తున్నారని, తప్పనిసరి పరిస్థితి లో వీడియోకాల్లోనే కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులకు రోజూ జూమ్, స్కైప్, వీడియోకాల్ ద్వారా ఫోన్లు చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు వివిధ రకాల యాప్ల ద్వారా ఆన్లైన్ క్లాసులు చెబుతున్న విషయం తెలిసిందే. మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం కొంతమంది అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా శుభకార్యాలనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తున్నారు.