నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. అనేక చైనీస్ యాప్స్ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో 14 యాప్స్ని బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే..
సాంకేతికత పెరిగిన తర్వాత.. మన జీవితం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఇంటి నుంచి కాలు కదిపే పని లేకుండా అన్ని పనులు ఆన్లైన్లోనే అయిపోతున్నాయి. అయితే టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అలానే ఉన్నాయి. నేటి కాలంలో సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీ కారణంగా మన వ్యక్తిగత సమాచారం అంతా నడి బజారులో షికారు చేస్తోంది. ఇక నేటి కాలంలో ప్రతి పనికి ఓ యాప్ రెడీగా ఉంటుంది. అయితే మనం వాడే కొన్ని యాప్స్ వల్ల మన వ్యక్తిగత భద్రతకు మాత్రమే కాక దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం.. అనుమానాస్పదంగా ఉన్న యాప్లపై నిషేదం విధిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 14 మెసేజింగ్, కాలింగ్ యాప్స్పై నిషేధం విధించింది కేంద్రం. ఆ వివరాలు..
ఉగ్రవాదులను, వారి చర్యలను కట్టడి చేసే విషయంలో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఉగ్రమూకల కట్టడి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఇప్పటికే దేశ భద్రతకు విఘాతం కలిగించే పలు యాప్స్ మీద నిషేధం విధించిన కేంద్ర.. తాజాగా మరికొన్నింటిని బ్యాన్ చేసింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్న 14 మొబైల్ మెసేజింగ్, కాలింగ్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ యాప్స్ ద్వారా.. ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నట్లు గుర్తించిన కేంద్రం, వాటిని బ్లాక్ చేసింది. దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్ల విషయంలో మోదీ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు తాజా నిర్ణయంతో మరోసారి రుజువైంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో కఠిన నిర్ణయాలకు వెనుకాడేది లేదని మోదీ ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది.
తాజాగా కేంద్రం నిషేంధించిన యాప్స్ జాబితాలో.. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, విక్రమ్, మీడియా ఫైర్, బ్రియార్, బీచాట్, నాండ్ బాక్స్, కోనియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా వంటివి ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటి ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి భారత్లోని కొంత మంది సానుభూతిపరులు మెసేజ్లు, కాల్స్ స్వీకరించినట్లు నిఘా వర్గాలు తేల్చాయి. జమ్మూ కశ్మీర్లోని వేర్పాటువాద సంస్థలు, ఆ సంస్థల్లో పని చేసే సానుభూతిపరులకు కోడ్తో కూడిన సందేశాలను పంపడానికి.. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఈ యాప్లను ఉపయోగించారని నిఘా వర్గాలు దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, గవర్నింగ్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద పైన పేర్కొన్న 14 మొబైల్ యాప్లను బ్యాన్ చేసింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమవ్వడానికి ఈ యాప్లను ఉపయోగిస్తున్నారనే కారణంతో వాటి యాక్సెస్ను బ్లాక్ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అనేక చైనీస్ యాప్లను నిషేధించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా, లోన్ అప్లికేషన్కు సంబంధించిన యాప్లను నిషేధించింది. అయితే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అప్లికేషన్లపై చర్య తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. మరి కేంద్రం నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.