ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరిస్థితి ఏం బాగున్నట్లుగా లేదు. చెన్నై చేతిలో ఘోర పరాభవం చవిచూసిన ఢిల్లీ జట్టుకు ఒక్క ఆటతోనే కాదు.. కరోనాతోనూ ముప్పు కొనసాగుతూనే ఉంది. తొలుత నెట్ బౌలర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ యువ ఓపెనర్ పృథ్వీ షా జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ విషయాన్ని స్వయంగా పృథ్వీ షానే సోషల్ మీడియాలో వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యులు పృథ్వీ షాకి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: CSK ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. ఇలా జరిగేతే చెన్నై ప్లే ఆఫ్స్ కి చేరడం పక్కా!
తాను జ్వరంతో ఆస్పత్రిలో చేరిన విషయాన్ని ఫొటో ద్వారా సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్ పై.. సెలైన్ ఎక్కించుకుంటూ ఉన్న ఫొటో షేర్ చేశాడు. ‘స్వల్ప జ్వరంతో ఆస్పత్రిలో చేరాను. చికిత్స పొందుతున్నాను.. మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. త్వరలోనే మైదానంలో అడుగుపెడతాను’ అంటూ పృథ్వీ షా పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఢిల్లీకి పృథ్వీ షా లేని లోటు కనిపిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్లో పృథ్వీ షా 9 మ్యాచ్ లలో 2 హాఫ్ సెంచరీలతో 259 పరుగులు స్కోర్ చేశాడు. ఢిల్లీ విషయానికి వస్తే చెన్నై మీద ఓటమితో కలిపి ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ లలో 5 విజయాలు 6 పరాజయాలతో 10 పాయింట్లతో కొనసాగుతోంది. ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.