సోషల్ మీడియా ప్రేమల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎంత చెప్తున్నా యువత వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఫ్రెండ్ షిప్, చాటింగ్.. అంతటితో ఆగకుండా ఫోన్లు, మీటింగులు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పరిచయాలు కాస్తా ప్రేమలుగా మారి.. పెళ్లిళ్ల వరకు దారితీస్తున్నాయి. ఆపై సుఖంగా ఉంటున్నారా! అంటే.. అదీ కాదు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శాల సమంతకు పశ్చిమ గోదారి జిల్లా, తణుకు సమీపంలోని సాలిపేటకు చెందిన నవీన్ అనే యువకుడితో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత చాటింగ్ లు ఎక్కువ అవడంతో.. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అంతటితో ఊరుకున్నారా! లేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఐతే తమ ప్రేమ గురించి ఇంట్లో చెబితే ఒప్పుకోరని భావించిన యువతి.. ఎనిమిది నెలల క్రితం తల్లికి చెప్పకుండా నవీన్ వద్దకు వెళ్లిపోయింది. దీంతో యువతీ యువకుడు ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం.. తణుకు పోలీసులను ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు.
పిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇరువురి పెద్దలను పిలిపించి.. వాళ్లిద్దరూ మేజర్లని పెళ్లికి చట్టబద్ధత ఉందని చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత యువతిని.. నవీన్ ఇంటికి పంపారు. రెండు నెలల వరకు అంతా సజావుగానే గడించింది. ఆ తర్వాత నవీన్ తనలోని మృగాన్ని బయటపెట్టాడు. కట్నం తీసుకురావాలంటూ నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఐతే ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కావడంతో యువతి అన్నీ భరిస్తూ వచ్చింది.
ఇంతలో ఆషాఢమాసం రావడంతో పుట్టింటికి వచ్చింది యువతి. తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని.. డబ్బుగానీ, బంగారంగానీ తీసుకురావాలంటున్నాడంటూ తల్లి వద్ద బోరున విలపించింది. కూతురికి నచ్చజెప్పిన తల్లి.. అంతా సర్దుకుంటుందని భావించింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. సదరు యువతి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో.. యువతిని పెళ్లిచేసుకొని.. ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఈ వరకట్న పిశాచిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!
ఇది కూడా చదవండి: అలా ఉండగా వీడియోలు తీసి ఆ వెబ్సైట్కు అమ్మాడు!