వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) విద్యార్థిని ఆదివారం మృతి చెందారు. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమె ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో హైడ్రామా నడిచింది.
సీనియర్ వేధింపులకు గురై ఆత్మహత్యయత్నం చేసుకున్న వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) విద్యార్థిని ఆదివారం మృతి చెందారు. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తొలుత ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువ వైద్యురాలు ఆదివారం కన్ను మూశారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన జనగాం జిల్లాలోని గిర్నీతండాకు అంబులెన్స్ లో పోలీసులు తరలించారు. ఈ క్రమంలో కొంత హైడ్రామా నడిచింది.
అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించక ముందు ప్రీతి తల్లిదండ్రులు.. ఆమె మృతదేహాన్ని బోడుప్పల్ లోని ఇంటికి తీసుకెళ్లాలని భావించారు. ప్రీతి ఈ ఇంట్లో పుట్టి, పెరిగిందని, ఆమెకు ఈ ఇంటితో చాలా అనుబంధం ఉందని, తమకు ఇక్కడికి తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని తండ్రి నరేంద్ర పోలీసులను వేడుకున్నాడు. ఈ ఇంటితో ఆమెకు చాలా అనుబంధం ఉందని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదు. బోడుప్పల్ తీసుకువచ్చేందుకు పై నుండి ఆర్డర్స్ లేవంటూ పోలీసుల నిరాకరించారు. దీంతో ఏం చేసేదీ లేక ప్రీతి తండ్రి, తల్లి, తోబుట్టువులు, కుటుంబసభ్యులు బోడుప్పల్లోని ఇంటికి వచ్చి బట్టలు తీసుకుని స్వగ్రామానికి వెళ్లారు.
బోడుప్పల్ ప్రీతి మృతదేహాన్ని తీసుకురానివ్వని పోలీసుల తీరుపై ప్రీతి తండ్రి నరేంద్ర మండిపడ్డారు. ఆ ఇంటికి ప్రీతిని తీసుకు వెళ్తామని ఎంతో వేడుకన్నప్పటికీ పోలీసులు అంగీకరించలేదని, బలవంతంగా ఆమె మృతదేహాన్ని గిర్నీ తండాకు అంబులెన్స్ లో తరలించారన్నారు. ఆ తర్వాత తాము వెళ్లినట్లు చెప్పారు. ప్రీతిది ఆత్మహత్య కాదుని హత్యేనని, ఆమె ఏం తీసుకుందో ఇప్పటివరకు నిర్థారణ కాలేదన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు చేపట్టాలని, మరొకరు ప్రీతిలా బలి అవ్వకుండా నిందితుడు సైఫ్ ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. తమ కుమార్తె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఆమెకు అంతిమ యాత్ర చేపడతామని నరేంద్ర తెలిపారు. ఆమె మృతదేహం గిర్నీ తండాకు చేరుకోగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైద్యురాలిగా వచ్చి ఈ గ్రామంలో సేవలందిస్తుందీ అనుకుంటే.. ఇలా శవమై వచ్చిందని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు రోదనలతో ఆ గ్రామంలో మిన్నంటాయి. ప్రీతికి నివాళులు అర్పించేందుకు గ్రామస్తులు భారీగా తరలివస్తున్నారు. ఆమె మృతికి తెలంగాణ సీఎం, మంత్రులు సంతాపం తెలిపారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతితో వరంగ్ లోని కేఎంసీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రీతి మృతికి నిరసనగా సోమవారం మెడికల్ కాలేజీ బంద్కు విద్యార్థి సంఘాలు ఓయూ జేఏసీ, ఏబీవీపీలు పిలుపునిచ్చాయి.