హైదరాబాద్ లో సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ కారణంగా హైదరాబాద్ లోని ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అయితే రెండు ఏరియాలు మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.
హైదరాబాద్ తో పోలిస్తే ఆ ఏరియాల్లో ఎక్కువగా ఇళ్ళు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఈ ఏరియాల్లో డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు కనుక ఈ ఏరియాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన ఇళ్ళ రిజిస్ట్రేషన్లతో పోలిస్తే మే నెలలో 31 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అయితే గత ఏడాది మే నెలతో పోలిస్తే మాత్రం హైదరాబాద్ ప్రాంత పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదయ్యాయి. గత ఏడాది మే నెల కంటే 7 శాతం తక్కువ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ అనే ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి గణాంకాలను వెల్లడించింది.
మే నెలలో మొత్తం 5,887 ఇళ్ళ రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ విలువ రూ. 2,994 కోట్లుగా ఉంది. ఈ మొత్తం రిజిస్ట్రేషన్లలో మల్కాజ్ గిరి జిల్లా అత్యధికంగా 45 శాతం రిజిస్ట్రేషన్లతో టాప్ లో నిలిచింది. ఆ తర్వాత 39 శాతంతో రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉంది. హైదరాబాద్ అయితే కేవలం 16 శాతంతో సరిపెట్టుకుంది. దీన్ని బట్టి హైదరాబాద్ లో ఇళ్ళ కొనుగోళ్ల సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు. మే నెలలో హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు బడ్జెట్ కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ తర్వాత రూ. 25 లక్షల లోపు ఇళ్ళు 17 శాతం నమోదవ్వగా, కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతం నమోదయ్యాయి.
గత ఏడాది మే నెలలో 6 శాతం నమోదైతే ఈ ఏడాది మే నెలలో 50 శాతం పెరిగాయి. అయితే వీటిలో ఎక్కువగా 1000 నుంచి 2000 చదరపు అడుగుల ఇళ్ళ రిజిస్ట్రేషన్లు 70 శాతం నమోదయ్యాయి. గత ఏడాది మే నెలలో సగటు లావాదేవీల విలువతో పోలిస్తే 3 శాతం పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఇల్లు కొనుక్కోవాలనుకునేవారి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా 1000 నుంచి 2 వేల చదరపు అడుగుల ఇళ్ళను కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుని నిలిపివేయడం కూడా ఈ డిమాండ్ ని బలపరిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ వెల్లడించారు.