పంట దిగుబడిని ప్లాస్టిక్ భూతం తినేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. రైతులు చేస్తున్న ఒక్క తప్పు వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు భూసారం కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పంట దిగుబడి తగ్గడానికి అనేక కారణాలు ఉండచ్చు. కానీ పొలంలో వాడే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వల్ల ఎంత ప్రమాదమో మీకు తెలుసా? చాలా వరకూ వ్యవసాయ పనుల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తులనే వాడుతున్నారు. ఈ సాంప్రదాయం గత 70 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ వినియోగం అనేక రెట్లు పెరిగిపోయింది. మల్చింగ్ షీట్లు, ఫార్మ్ పాండ్ లైనింగ్, డ్రిప్ సిస్టమ్, పీవీసీ పైపులు, గ్రీన్ హౌజ్ పై కప్పులు వంటి వాటితో ప్లాస్టిక్ వినియోగం అధికంగా పెరిగిపోతుంది. వీటిలో పంటకు ఎక్కువ హాని కలిగించేది మల్చింగ్ షీట్. ఒక పంట వేస్తే చిరిగిపోతుంది ఈ మల్చింగ్ షీట్. కలుపు రాకుండా ఉండడం కోసం దీన్ని వేయడం జరుగుతుంది. దీని వల్ల కలుపు తీసే శ్రమ, ఖర్చు తగ్గుతున్నాయి.
మట్టిలో నీటి తేమ ఆరిపోకుండా మల్చింగ్ షీట్ కాపాడడం ద్వారా నీరు ఆదా అవుతుంది. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. అందుకే మల్చింగ్ షీట్లు వాడుతున్నారు రైతన్నలు. అయితే ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. రైతులకు తెలియకుండానే పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి ఈ మల్చింగ్ షీట్లు. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ కి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 2019 సంవత్సర కాలంలో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు, ఆక్వా సాగు, చేపల వేట కోసం, అలానే ఆయా ఆహార ఉత్పత్తులను కస్టమర్లకు చేర్చే వరకూ ఈ మొత్తం ప్రాసెస్ లో కోటి 20 లక్షల టన్నుల ప్లాస్టిక్ ను వాడినట్లు ఎఫ్.ఏ.ఓ. అంచనా వేసింది.
ప్రపంచవ్యాప్తంగా పంటలు, ఉద్యాన తోటల సాగు, పశువుల పెంపకంలో ఏటా కోటి టన్నుల ప్లాస్టిక్ వినియోగిస్తున్నారని.. ఇందులో మల్చింగ్ షీట్స్ వాటా 34 లక్షల టన్నులని తెలిపింది. ఇక చేపల వేట, ఆక్వా సాగులో 21 లక్షల టన్నులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించి 2 లక్షల టన్నుల ప్లాస్టిక్ వస్తువుల వినియోగం జరుగుతుందని ఎఫ్.ఏ.ఓ. వెల్లడించింది. 2030 నాటికి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం 50 శాతం పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో 60 లక్షల టన్నుల ప్లాస్టిక్ ని ఆసియా దేశాల రైతులే వాడుతున్నారని ఎఫ్.ఏ.ఓ. తెలిపింది.
ఈ ప్లాస్టిక్ వినియోగంలో ఎక్కువగా మల్చింగ్ షీట్స్ ఉండడం ప్రధానంగా పంటను నాశనం చేస్తుందని ఎఫ్.ఏ.ఓ. హెచ్చరించింది. పంట భూముల్లో మిగిలిపోయే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ అవశేషాలు కాలుష్యానికి దారి తీస్తాయి. దీని వల్ల సూక్ష్మజీవరాశి నశించి పంట దిగుబడులు తగ్గిపోతున్నట్లు పేర్కొంది. అంతేకాదు భూమిలో కలిసిన ఈ ప్లాస్టిక్ (మల్చింగ్ షీట్ల అవశేషాలు) ద్వారా వెలువడిన మైక్రో ప్లాస్టిక్స్ ఆహారోత్పత్తులు, నీటి ద్వారా మనుషుల కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తుందని తెలిపింది. ప్లాస్టిక్ కణాల్లో ఉండే థాలేట్స్, బిస్పినాల్స్ వంటి విషపూరిత పదార్థాలు మానవ హార్మోన్ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. దీని వల్ల అనారోగ్యం బారిన పడతారు. ఈ ప్లాస్టిక్ వస్తువులు, మైక్రో ప్లాస్టిక్స్ కాలువల ద్వారా సముద్రంలోకి చేరి చేపలు, రొయ్యలు వంటి జీవులకు హాని చేస్తున్నాయి. వాటిని తినడం వల్ల మనిషి అనారోగ్యానికి గురవుతున్నారు.
మరొకవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వ్యవసాయ భూముల్లోనో లేక చెత్త కుప్పల్లో తగలబెడుతున్నారు. దీని వల్ల పాలీక్లోరినేటెడ్ డిబెన్ జో-పి-డయాక్సిన్లు, ఫ్యురాన్లు వంటి విష వాయువులు ఇటు పర్వావరణానికి, అటు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలను క్రమ పద్ధతిలో సేకరించి రీసైక్లింగ్ చేసే వ్యవస్థ కొరవడడంతో ఈ ముప్పు వాటిల్లుతుంది. అంతేకాదు ఆహార భద్రత, ఆహార నాణ్యత, పౌష్టికాహార శోషణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయంటూ ఎఫ్.ఏ.ఓ. తెలిపింది. వ్యవసాయంలో ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడకాన్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, పాలకులకు సూచనలు చేసింది.పంట చేతికొచ్చిన తర్వాత చిరిగిన మల్చింగ్ షీట్ ముక్కలను ఏరివేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. దీని వల్ల కొంత ప్లాస్టిక్ ముక్కలు భూమిలో ఉండిపోతున్నాయి. వీలైనంత సేకరించిన ప్లాస్టిక్ ముక్కలను తగులబెట్టడం లేదా చెత్తకుప్పలో వేస్తున్నారు.
వీటితో పాటు డ్రిప్ పైపులు సహా పలు ప్లాస్టిక్ వస్తువులు భూమిలో ఉండిపోయి కలుషితం చేస్తున్నాయి. పంట పూర్తయ్యాక ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసే విధానం ఆసియా దేశాల్లో సరిగా లేదని… కేవలం 10 శాతం మాత్రమే వ్యర్థాలను సేకరించి తిరిగి వాడగలుగుతున్నామని ఎఫ్.ఏ.ఓ. పేర్కొంది. ప్లాస్టిక్ వ్యర్థాలలో ఉన్న ప్లాస్టిక్ కణాలు మట్టిలోని సూక్ష్మ జీవులను నాశనం చేసి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక కేజీ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వల్ల 700 చదరపు అడుగుల భూమి కలుషితమవుతుందని అంచనా వేసింది. చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను శుద్ధి చేసి 99 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తున్నారని.. ఇవి కొంతవరకూ రైతులకు ఉపయోగపడినా దీర్ఘకాలికంగా పర్యావరణాన్ని, భూమిని, మనుషులు, పశుపక్ష్యాదులు, జీవరాశుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఎఫ్.ఏ.ఓ. హెచ్చరించింది.
మరి ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్ వాడకుండా పంట దిగుబడి పెంచలేమా అంటే.. దానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. పంటల మార్పిడి పాటించడం, పంట పొలంలో అంతర పంటలు వేయడం వంటివి చేయవచ్చు. లేదా ఎండు గడ్డిని మల్చింగ్ గా వాడచ్చు. కొబ్బరి పీచుతో తయారు చేసే చాపలను మల్చింగ్ షీట్స్ గా వాడుకోవచ్చు. ఇవే కాకుండా పర్యావరణహితమైన మల్చింగ్ షీట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ వెంటనే మట్టిలో కలిసిపోతాయి. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ తో పోలిస్తే వీటి ధర ఎక్కువ. శాస్త్రవేత్తలు, పాలకులు కలిసి పర్యావరణహితమైన మల్చింగ్ లను తక్కువ ధరకు రైతులకు అందుబాటులోకి తీసుకొస్తే భూమి దెబ్బతినదు.