జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. జిల్లాను రణరంగంగా మార్చింది. కోనసీమనే ముద్దు.. మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలు జుళిపిస్తే.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగారు ఆందోళనకారులు.చివరకు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఫలితంగా కోనసీమ రణరంగంగా మారింది. మరి ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి ప్రముఖంగా 5 కారణాలు వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే..
వివాదానికి ఐదు కారణాలు..
1. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు నెల రోజుల గడువిచ్చింది. వినతులు కలెక్టర్ కార్యాలయానికి అందించే వెసులుబాటు కల్పించింది. ఆందోళనలు నిర్వహించకుండా 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపై తీరుపై వ్యతిరేకత వ్యక్తమైంది. కోనసీమ పేరును కొనసాగించాలనే డిమాండ్లు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఇప్పటికే వందల సంఖ్యలో వినతులు కలెక్టరు కార్యాలయానికి చేరాయి. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ‘కోనసీమ జిల్లా సాధన సమితి చలో అమలాపురానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అయినప్పటికి కూడా హింస చెలరేగింది.
2. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లాలోని ముమ్మడివరం వెళ్లారు. అక్కడ స్థానిక నేతలు జిల్లా పేరు మార్పు అంశాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. దీంతో ఆయన కూడా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వినతుల్ని పరిశీలించిన జగన్ సర్కారు సానుకూలంగా స్పందించింది. జిల్లా పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే కోనసీమ జిల్లా పేరులో మార్పు చేసింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నట్లు ప్రకటించారు.
3. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడంతో దళిత సంఘాలు, వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ఏదొక చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కోనసీమ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు అమలాపురంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కోనసీమ అనే తమ భౌగోళిక గుర్తింపును కాదని జిల్లా పేరు మార్చారన్నారు.
4. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేడ్కర్ అంటే తమకెంతో గౌరవం ఉందని కానీ ఆయనకు ఎలాంటి సంబంధం లేని కోనసీమ జిల్లాకు ఆ పేరు పెట్టడం భావ్యం కాదనేది వారి వాదన. జిల్లాకు ఏ పేరూ వద్దూ.. కోనసీమే ముద్దు అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
5. అంతేకాక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి పేరుతో ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు తగలబెట్టడంతో చోటుచేసుకున్న హింస, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కోనసీమ జిల్లా చర్చనీయాంశమైంది.
కోనసీమలో నేటి నుండి కర్ఫ్యూ ..
తాజా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కోనసీమ ప్రాంతంలో శాంతి భద్రతలను తీసుకురావడానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి జిల్లాకు అదనపు బలగాలను పంపి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చెయ్యాలని హోం మంత్రి తానేటి వనిత అధికారులకు ఆదేశించారు. కోనసీమ వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించడంతో, నేటి నుండి కర్ఫ్యూ అమలు కానుంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకూ కర్ఫ్యూ అమలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. మరి ఈ రోజు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.