దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా వుంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొందరు ప్రాణాలను నిలుపుకునేందుకు ప్లాస్మా కావాలంటున్నారు. అందువల్ల కొవిడ్ వారియర్స్ ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జునలు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేసి కష్ట సమయంలో ప్రాణాలను కాపాడాలన్నారు నాగార్జున.
టీ హోప్ అనే స్వచ్చంద సంస్థలో అందరూ భాగం కావాలని కోరుతూ నాగార్జున ట్వీట్ చేశారు. ఇలా అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున వంటి వారు ప్లాస్మాను దానం చేయాలని కొవిడ్ వారియర్స్కు పిలుపునివ్వడం మంచి పరిణామమే. కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే టాలీవుడ్ నిర్మాణ సంస్థలు, స్టార్స్ అందరూ ఆక్సిజన్, బెడ్స్, ప్లాస్మా అవసరం అయిన వారి వివరాలను రీ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.