సమాజంలో కొంత మంది ప్రజలకు ప్రభుత్వ బడులపై ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ చదువు సరిగా చెప్పరని.. క్రమశిక్షణ ఉండదని రక రకాల అపోహలు ఉంటుంటాయి. అందుకే అప్పు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపుతుంటారు. ఈ దుష్ప్రచారాన్ని ఖండించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. కొంత మంది ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పని చేస్తున్న ఎండి ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయించారు. ఈ సంవత్సరం ఏపిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు ఎండి ప్రభాకర్ రెడ్డి సతీమణి లక్ష్మి తెలిపారు. నాడూ-నేడు తో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు ఎన్నో మారాయని ప్రశంసించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మార్పులు తీసుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. స్కూల్లో వసతులు చక్కగా ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి గత నెలలో నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసే సమయంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. తాము ఉన్నత విద్యనభ్యసించి.. ఉన్నత స్థాయిలో ఉండి కార్పోరేట్ చదువులు చెప్పించే స్థోమత ఉన్నా తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ముందుకొచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.