దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత దేశమే కాకుండా దక్షిణ భారతం కూడా అతలాకుతమౌతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమౌతున్నాయి. ముసురు పట్టిన మేఘాలు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారత దేశమే కాకుండా దక్షిణ భారతం కూడా అతలాకుతమౌతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమయమౌతున్నాయి. ముసురు పట్టిన మేఘాలు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి. దీంతో భారీగా వరద నీరు ఎగువ రాష్ట్రాల నుండి దిగువ రాష్ట్రాలకు వచ్చి చేరుతుంది. దీంతో గోదావరికి ఉధృతంగా వరద నీరు చేరడంతో నీటి మట్టం పెరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మరో అల్పపీడనం పొంచి ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉంటోది డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్రత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ఇప్పటికే ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముందస్తు సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ దళాలలను అల్లూరు సీతారామ రాజు, ఏలూరు జిల్లాలకు తరలించింది.
కాగా, ఈ వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలపై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణాలో భారీగా కురిసిన వర్షాలకు ఎగువ నుండి వరద నీరు గోదావరికి చేరుతుంది. దీంతో విలీన మండలాల్లోని 100కు పైగా ముంపు గ్రామాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ నిలిచిపోయింది. కూనవరం, టేకులబోరు, వడ్డిగూడెం గ్రామాలకు వరద పోటేత్తింది. అయితే ముందే మేలుకున్న ప్రజలు.. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు, ఎగువ ప్రాంతాలకు చేరుకున్నారు. ఇంకా చాలా గ్రామాలు నీటి ముంపులో కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూనవరం మండలంలో దాదాపు 30 గ్రామాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వీఆర్ పురంలోని 30 గ్రామాలు, కుక్కునూరులో 10, ఏలూరు జిల్లా వేలేరుపాడులో 25 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
గోదావరి ఉపనది శబరి నది నుంచి విలీన మండలాలకు భారీగా ఇన్ఫ్లో చేరడంతో వడ్డిగూడెం వాసులు 600 మందికి పైగా ప్రజలు స్వగ్రామాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వడ్డిగూడెం వాసులకు రేకపల్లి గ్రామంలో ఆశ్రయం కల్పించారు. ఇక ఏలూరు జిల్లా దాచారం, కుక్కునూరు మధ్య ప్రధాన రహదారులపై వరద నీరు చేరింది. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వేలేరు పాడు మండలంలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. పై నుండి వరద నీరు ఇంకా వస్తున్న నేపథ్యంలో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొడియా, కట్కూరు ప్రాంతాలకు 16 గ్రామాలకు రోడ్డు రవాణా నిలిచిపోయిందన్నారు. ఇరు జిల్లాల కలెక్టర్లు.. సంరక్షణా కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఆహారాన్ని, నిత్యావసర సరుకులను అందిస్తున్నారు.
కాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లు ద్వారా 1070 మరియు 18004250101 సంప్రదించాలని ఏపీఎస్ఎండిఎ (APSDMA) ప్రజలకు సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచిస్తోంది. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది. వరద నీటిలో ఈత, చేపల వేటకు వెళ్లవద్దని, నదిలో పడవలు, మోటర్బోట్లు, స్టీమర్లలో ప్రయాణించడం మానుకోవాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజలకు సూచించారు.