ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా పేరు మార్పు అనే అంశంతో అట్టుడికిపోయింది. అంబేడ్కర్ జిల్లాగా పేరు మార్చే అంశాన్ని కొందరు వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. నేతల ఇళ్లను ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం చేశారు. అయితే ఈ అల్లర్లకు సంబంధించి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రతిపక్షాలు ఇలా కుట్ర చేస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పుదోవ పట్టించడానికే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ విమర్శిస్తున్నారు.
అయితే ఈ మొత్తం అంశంలో అల్లర్లకు కారణైన వ్యక్తి ఇతనే అంటూ అన్యం సాయి అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభ్యంతరాలు తెలిపేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లిన వారిలో ఇతను కూడా ఒకడు. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కలెక్టర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను జనసేన పార్టీకి చెందిన వ్యక్తిగా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అతను వైసీపీ ప్రభుత్వం సానుభూతిపరుడు అంటూ జనసేన విమర్శిస్తోంది.
ఇదీ చదవండి: కడప జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టుకోవచ్చు కదా?: పవన్ కల్యాణ్
ఇదీ చదవండి: నివురుగప్పిన నిప్పులా కోనసీమ.. ఇంటర్నెట్ సేవలు బంద్!
ఇప్పటికే వైసీపీ- జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో వేదికగా అన్యం సాయి అనే వ్యక్తి విషయంలో పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. అన్యం సాయి అనే వ్యక్తి జనసేన కార్యకర్త అంటూ కొన్ని ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అన్యం సాయి అమలాపురానికి చెందిన వైసీపీ నేత ఒంటెద్దు వెంకటనాయుడికి అనుచరుడు అంటూ జనసేన కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. జనసేనపై బురద జల్లేందుకే ఇలా చేస్తున్నారంటూ.. అన్యం సాయి సజ్జల, వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ హోంమంత్రితో దిగిన ఫొటోలు, మంత్రి విశ్వరూప్ కు మద్దతుగా కట్టిన ఫ్లెక్సీల ఫొటోలను జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.
అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడ్డాయి. ప్రస్తుతం అమలాపురం, చుట్టుపక్కల ప్రాంతాలు పోలీసుల అదుపులోనే ఉన్నాయి. అయితే అల్లర్లకు కారణమైన వారిలో 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడవల సమయంలో తీసిన వీడియోలు, ఫొటోల ఆధారంగా కారకులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే అన్యం సాయి అనే వ్యక్తికి గొడవలకు ఎంతవరకు సంబంధం ఉంది అనేది పోలీసుల విచారణ తెలియాల్సి ఉంది. ఈ అల్లర్ల వెనుక ఉన్నది ఎవరైనా వదిలేది లేదని.. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అన్యం సాయి అనే వ్యక్తి అల్లర్లకు కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.