ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్ష విధించిన వారిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి. వీరపాండియన్ ఉన్నారు. వీరికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు హాజరైన ఐఏఎస్లు వీరపాండియన్, అరుణ్ కుమార్ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలు నిలిపివేస్తూ.. న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే పూనం మాలకొండయ్య సకాలంలో హాజరుకాకపోవడంతో.. తీర్పు అమలును నిలుపుదల చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. అంతేకాక న్యాయస్థానాలు ఎవరి కోసం ఎదురు చూడవని.. ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మే 13 న రిజిస్ట్రార్ ముందు సరెండర్ కావాలని పూనం మాలకొండయ్యను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: AP High Court: వ్యభిచార గృహానికి కస్టమర్ గా వెళ్లిన వ్యక్తిపై కేసు పెట్టి విచారించేందుకు వీల్లేదు: ఏపీ హైకోర్టు
సింగిల్ జడ్జి తీర్పుపై పూనం మాలకొండయ్య శుక్రవారమే అత్యవసరంగా ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఆ అప్పీల్పై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం.. పూనం మాలకొండయ్య విషయంలో సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేసింది. కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2)గా ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ జిల్లాకు చెందిన ఎన్.మదన్ సుందర్ గౌడ్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టుకు పిటిషనర్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని, రెండు వారాల్లో ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని 2019 అక్టోబర్ 22న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ‘బిగ్ బాస్ షో’ ఆగిపోతుందా..? ఏపీ హైకోర్టు షాకింగ్ కామెంట్స్!
కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి, ఐఏఎస్ పూనం మాలకొండయ్య 2019 సెప్టెంబర్ 27న.. హెచ్ అరుణ్కుమార్కు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పుట్టారు. మరోవైపు కోర్టు ఆదేశాల అమలు కోసం అరుణ్కుమార్.. జి.వీరపాండియన్కు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదన్నారు. వీరపాండియన్ సైతం కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలయ్యాకే.. స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
ఇది కూడా చదవండి: అతడికి కాలే పెద్ద శాపం అయ్యింది.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం పోయింది!
సరైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయడంలో అధికారులు ముగ్గురూ నిర్లక్ష్యం చేశారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వుల అమలులో ఇబ్బందులు ఎదురైతే అధికారులు సమయం పొడిగింపు కోసం న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయవచ్చని, ప్రస్తుత కేసులో అలాంటి యత్నాలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించారు. అయితే, ఇద్దరిపై తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలిపివేయడం, పూనం మాలకొండయ్యపై సింగిల్ జడ్జి తీర్పును నిలుపుదల చేయడంతో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు కాస్త ఊరట లభించింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.