మున్మున్ తన కుమారుడితో కలిసి ఇంట్లో బంధీ అయింది. ఆఫీస్కు వెళ్లిన భర్తను మళ్లీ ఇంట్లోకి తిరిగిరానివ్వలేదు. అతడు ఎంత మొత్తుకున్నా ఇంట్లోకి రానివ్వలేదు. దాదాపు మూడేళ్ల పాటు అలా ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు పోలీసుల
మూడేళ్ల క్రితం దేశంలోకి చొరబడ్డ కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి విలయాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థికంగా దేశం మొత్తం అతలాకుతలం అయింది. కొన్ని కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయారు. రోడ్డున పడ్డ వారి సంఖ్య లెక్కలేదు. కరోనా లాక్డౌన్ సమయంలో జనం ఇంటినుంచి బయటికి రాకుండా తమను తాము కట్టడి చేసుకున్నారు. అయితే, కరోనా నశించి ఏళ్లు గడుస్తోంది. అయినా కొంతమంది ఇప్పటికీ ఇంటినుంచి బయటకు రావటానికి అల్లాడిపోతున్నారు.
తాజాగా, ఓ తల్లి తన కుమారుడితో మూడేళ్లుగా ఇంట్లోనే ఉండిపోయింది. లోపల గడియ పెట్టుకుని జీవిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని బయటకు తీసుకువచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని గురుగావ్కు చెందిన మున్మున్ మజి అనే మహిళ లాక్డౌన్ సమయంలో తన ఇంట్లో ఉండిపోయింది. తన 10 ఏళ్ల కుమారుడిని కూడా తనతో పాటు ఇంట్లోనే బంధీని చేసింది. ఇక, అప్పటినుంచి వారిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఆమె భర్త సుజన్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
ఓ రోజు సుజన్ ఆఫీస్కు వెళ్లటానికి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. దీంతో ఆమె అతడ్ని మళ్లీ ఇంటి లోపలికి రానివ్వలేదు. ఎంత అరిచి, గీ పెట్టుకున్నా ఆమె తలుపు తీసేది కాదు. దీంతో సుజన్ మొదట తన ఫ్రెండ్స్, బంధువుల ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. తర్వాత ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని అందులోకి దిగాడు. కేవలం వీడియో కాల్స్ ద్వారా భార్యా, పిల్లలతో మాట్లాడేవాడు. వారికి అవసరమైన వస్తువులు తీసుకెళ్లి కిటికీ ద్వారా లోపల పడేసేవాడు. అన్ని అవసరాలు స్వయంగా తీర్చేవాడు. చాలా సార్లు ఆమెను ఒప్పించటానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. 10 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే వరకు బయటకు రానని ఆమె భీష్మించుకుకూర్చుంది.
బంధువులు, పుట్టింటి వారితో కూడా సంబంధాలు కట్ చేసుకుంది. మూడేళ్ల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా జీవించింది. మున్మున్ ప్రవర్తనతో విసిగి వేసారిపోయిన భర్త చివరకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య పరిస్థితి గురించి వారికి చెప్పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతి బలవంతం మీద మున్మున్ను బయటకు తీసుకువచ్చారు. ఇందుకోసం ఆరోగ్య శాఖ, శిశు సంరక్షణ శాఖ ఇతర ఎన్జీవోల సహాయం తీసుకున్నారు. వారిని బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి మానసిక, శారీరక సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.