రాత్రిపూట చందమామను కెమెరా కన్నుల్లో బంధించటం ఇప్పుడో ట్రెండ్. కరోనా మహమ్మారి ఆందోళనను తగ్గించుకోవటానికో, తమలోని కళను చూపించుకోవటానికో గానీ చాలామంది దీన్నే అనుసరిస్తున్నారు. తగిన స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే ఇక చెప్పేదేముంది? రోజులు, నెలలు గడచి పోతున్నాయి. పనులు, ఉద్యోగాలు, చదువులు అన్నీ ఇంటి నుంచే. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో? తమలోని నిరాశా నిస్పృహలు పోగొట్టుకోవటానికి, కాస్త హుషారును సొంతం చేసుకోవటానికి అలా బాల్కనీలోకి రావటం చుట్టుపక్కల పరిసరాలను గమనించటం పరిపాటిగా మారిపోయింది. ఆకాశం వంక చూస్తూ నక్షత్రాలను, వెన్నెలను కురిపించే జాబిల్లిని పరికిస్తూ తమ కళాత్మక దృష్టికీ చాలామంది పదును పెడుతున్నారు. చందమామ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పరవశించి పోతున్నారు.
నిజానికి స్మార్ట్ఫోన్తో జాబిల్లి ఫొటో తీయటం చిన్న విషయమేమీ కాదు. చందమామ చాలా దూరంలో ఉంటాడాయె. కెమెరా లెన్స్ చాలా నాణ్యమైనదైతే తప్ప ఫొటోలో స్పష్టంగా ఒదిగిపోడు. అంటే బేసిక్ టెలీఫొటో లెన్స్ కన్నా మరింత మెరుగైనదే కావాలన్నమాట. చందమామను జూమ్ చేసిన కొద్దీ ప్రకాశవంతంగా కనిపిస్తుంటాడు గానీ దృశ్యం బ్లర్ అవుతుంటుంది. తక్కువ వెలుతురులో మంచి ఫొటో తీయటమూ కష్టమైపోతుంటుంది. మంచి స్మార్ట్ఫోన్ ఉంటే ఇదేమీ పెద్ద కష్టం కాదు. మంచి ఆటోఫోకస్ సాధ్యమవుతుంది. వేగంగా పనిచేసే లెన్స్, ప్రాసెసింగ్ పవర్ మూలంగా చిన్న చిన్న వివరాలు కూడా స్పష్టంగా గోచరిస్తాయి. రాత్రి వేళల్లోనూ నాణ్యమైన వీడియో తీసుకునే వెసులుబాటు ఉండటం విశేషం. అల్ట్రా వైడ్ లెన్స్ మూలంగా అంచుల వద్ద ఎలాంటి కొరుకులు లేకుండా ఫొటోలు తీయొచ్చు. వన్ ప్లస్ 9 ప్రొ లేటెస్ట్ ఫోన్స్ లో ఒకటి. ఖగోళ శాస్త్రవేత్తలు ఉపయోగించే కెమెరాలను తయారుచేసే హాసిల్బ్లాడ్ కంపెనీ భాగస్వామ్యంతో రూపొందిన కెమెరా వ్యవస్థ దీని సొంతం. రాత్రిపూట చందమామ దృశ్యాలను చాలా స్పష్టంగా, ప్రకాశవంతంగా ఒడిసిపడుతుంది. ఇందులో 30 రెట్ల డిజిటల్ జూమ్ పరిజ్ఞానం ఉంది. చాలా వేగంగా దృశ్యాన్ని పట్టుకుంటుంది.