ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్.. సాఫ్ట్వేర్ ఉద్యోగం. కళ్లు చెదిరే ప్యాకేజ్.. వీకెండ్స్, కంపెనీ పని మీద ఫారిన్కు వెళ్లే అవకాశం ఉండటంతో.. చాలా మంది యువత సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే సాఫ్ట్వేర్ కొలువు రావడం అంత సులభం ఏంకాదు. నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా.. ఏవో కోర్సులు నేర్చుకుని.. ఇంటర్నషిప్ వంటివి చేస్తే.. తప్ప కలల కొలువు సాధించడం సాధ్యం కాదు. సాఫ్ట్వేర్ జాబ్ అనే కాదు.. ఏ ఉద్యోగం సాధించాలన్నా.. డిగ్రీ తప్పనిసరి. అలాంటిది కేవలం.. ఇంటర్ విద్యార్హతతోనే.. సాఫ్ట్వేర్ జాబ్ సాధించే అవకాశం లభిస్తే.. అంతకన్నా శుభవార్త మరొకటి ఉండదు. మరి ఇంతకు ఈ బంపరాఫర్ ఎక్కడ అంటే..
విద్యార్థులు ఇంటర్తోనే సాఫ్ట్వేర్ కొలువు సాధించే అవకాశం కల్సించబోతుంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని లక్షమున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించేందుకుగాను.. ప్రభుత్వం ప్రముఖ టెక్ కంపెనీ హెచ్సీఎల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. దీని ప్రకారం ఇంటర్ విద్యార్హతతోనే.. సాఫ్ట్వేర్ జాబ్ సాధించాలనుకునేవారికి ఇది ఎంతో మంచి అవకాశం. కాకపోతే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. ఆ వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ పొందే అవకాశం కల్సిస్తోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ కలిగి ఉండి.. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 2023, ఫిబ్రవరిలో ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఈ ఆన్లైన్ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్కు వర్చువల్ పద్ధతిలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వూల్లో మెరుగైన ప్రదర్శన చేసినవారిని.. ట్రైనింగ్కు సెలక్ట్ చేస్తారు. ఆరు నెలల పాటు.. ఆన్లైన్లో ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆఫీస్లో ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. ఈ ఆరునెలల కాలంలో.. అభ్యర్థికి ప్రతి నెల 10 వేల రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇక ఇంటర్న్షిప్ పూర్తైన తర్వాత.. వారికి ఏడాదికి రెండున్నర లక్షల ప్యాకేజీ ఇస్తారు.
మరి ఉద్యోగం వచ్చాక.. ఇంటర్తోనే చదువు ఆపేయాలా అంటే.. కాదు.. ఇలా ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటీ వంటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసేందుకు కూడా అవకాశం కూడా కల్పిచంనున్నట్లు మంత్రి సబిత వివరించారు. ప్రతి ఏడాది శాలరీ ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయని.. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఇది సువర్ణావకాశమని.. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంటర్తోనే సాఫ్ట్వేర్ జాబ్ పొందే అవకాశం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంపలో తెలియజేయండి.