తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరీక్షల నిర్వహణ కోసం ఆశా, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్లలకు హెల్త్ స్ర్కీనింగ్ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో బీపీ మిషన్, గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్ మీటర్, బరువును తూచే యంత్రం, ఎత్తు కొలిచే టేపు, టార్చ్ లైట్, స్టెతస్కోప్, డిజిటల్ పల్స్ ఆక్సీమీటర్, డిజిటల్ థర్మామీటర్, షాకీర్ టేప్ ఉంటాయి. ‘హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని సెప్టెంబరు మొదటివారం నుంచి ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు.
హైరిస్క్ వ్యక్తులను గుర్తించి మరిన్ని పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపుతారు. అక్కడ మరో పది రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వీటి ద్వారానే ఇంటి వద్ద పది రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారు. ఒకవేళ పరీక్షలో అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపుతారు. అక్కడ మరో పది రకాల పరీక్షల నిర్వహణ కోసం పార్ట్సెల్ కౌంటర్, సెమీ ఆటో ఎనలైజర్, ఈసీజీ యంత్రం, పారా మానిటర్, ఆటో రిఫ్రాక్టోమీటర్, ఇన్డైరెక్ట్ ఆప్తాహల్మాస్కోప్, ట్యూనింగ్ పోర్క్, స్కిన్ ఫోల్డ్ కాఫిపర్, డెంటల్ టేబుల్ను అందుబాటులో ఉంటాయి. వీటిలో కొన్ని ఇప్పటికే పీహెచ్సీల్లో ఉన్నాయి. లేని చోట్ల సమకూర్చుతారు. పరీక్షలు చేసే ప్రతి ఒక్కరీ ఆధార్ నంబరును విధిగా నమోదు చేస్తారు.
ఆధార్నే హెల్త్ ప్రొఫైల్ యూనిక్ ఐడీ నంబరుగా పరిగణిస్తారు. దీన్ని మొబైల్ ఫోన్తో అనుసంధానిస్తారు. ఆధార్ ఆధారంగా ఎవరు పడితే వారు ఇతరుల ఆరోగ్య వివరాలను తెలుసుకోకుండా బ్లాక్ చైన్ సాంకేతికతను వాడనున్నారు. వైద్యుడి వద్దకు వెళ్లి ఆధార్ నంబరు చెబితే మొబైల్కు వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. అది చెబితేనే ఆరోగ్య వివరాలు తెరుచుకుంటాయి. అదీ కూడా ఓ అరగంటసేపు మాత్రమే కనిపిస్తాయి. అనంతరం ఆటోమేటిగ్గా మాయమయ్యేలా ఈ హెల్త్ప్రొఫైల్ను డిజైన్ చేశారు. పౌరులు మాత్రం వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు చూసుకునే వెసులుబాటు కల్పించారు. అందుకోసం ఈ-రిపోర్టు విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
మందులు కూడా ఈ-ప్రిస్కిప్షన్ ద్వారానే ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఇతర మంత్రులతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఇంత భారీ ప్రాజెక్టు చేపట్టి ముందు రాష్ట్రంలో చిన్న జిల్లాలైన ములుగు, సిరిసిల్లను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నామని ఆయన తెలిపారు. ముందుగా ఈ రెండు జిల్లాల్లో ఉన్న వైద్య శాఖ సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను ప్రజల ఇంటివద్దనే సేకరిస్తామన్నారు.