డ్రోన్ల వినియోగం బహుముఖ రీతిలో విస్తరిస్తోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఔషధాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. సరిగ్గా రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, తండాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. వికారాబాద్ జిల్లాలో రవాణా సదుపాయాలు లేని మారుమూల అటవీప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందులను తరలించనున్నారు. ఈ పథకానికి ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై‘ అని పేరుపెట్టారు. వికారాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ పథకాన్ని ప్రారంభించారు. మందులు ఉన్న బాక్సును సింథియా డ్రోన్ లో ఉంచి ప్రారంభోత్సవం చేశారు. మొత్తం మూడు డ్రోన్లలో మందులు ఉంచి వికారాబాద్ రీజనల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, టెక్నాలజీ వినియోగాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహిస్తుంటారని తెలిపారు. టెక్నాలజీ ప్రధానంగా సామాన్యుడికి ఉపయోగపడాలన్నది ఆయన ఆకాంక్ష అని అన్నారు. డ్రోన్ల ద్వారా మందులే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కూడా తరలిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ ప్రాజెక్టులో గ్లోబల్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటికే డ్రోన్ల సరఫరాపై తెలంగాణ ప్రభుత్వ ఎనిమిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ, ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్పేట పీహెచ్సీలకు మందులను సరఫరా చేస్తారు. బ్లూడార్ట్ ఎక్స్ప్రెస్, డ్రోన్ డెలివరీ స్టార్టప్ స్కై ఎయిర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.
దేశంలో డ్రోన్ల వాడకాన్ని సులభతరం చేసేలా కేంద్రప్రభుత్వం డ్రోన్ రూల్స్ పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది. డ్రోన్లను వినియోగించేందుకు ఇప్పటి వరకు 25 దరఖాస్తులు నింపాల్సి ఉండగా తాజా నిబంధనల్లో వాటిని ఆరుకు తగ్గించింది. అంతే కాకుండా డ్రోన్ల పరిమాణంతో సంబంధం లేకుండా దరఖాస్తు ఫీజులను కూడా నామమాత్రంగా వసూలు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ గురువారం నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది.
ఆకాశంలో ఎగరడం, గమ్యస్థానాలకు చేరే వరకు మానిటర్ చేయడం, వాటి రక్షణ వంటి వాటిని పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. అధికారులు మెడిసన్ ఫ్రం స్కై కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులతో పాటు పీహెచ్సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ వంటి పలు అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు ఆకాశంలో ఎగరడం, గమ్యస్థానాలకు చేరే వరకు మానిటర్ చేయడం, వాటి రక్షణ వంటి వాటిని పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది.