మెడికో ప్రీతి మృతిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతి చెందింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీతి మృతిపై మావోలు స్పందించారు. లేఖ విడుదల చేశారు. ఆ వివరాలు..
వరంగల్ కేఎంసీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న మెడికో ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక.. ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. సుమారు ఐదు రోజుల పాటు వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. కానీ లాభం లేకపోయింది. మృత్యువుతో పోరాటంలో ప్రీతి ఓడిపోయి మృతి చెందింది. ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. సైఫ్ వేధింపుల గురించి ప్రీతి.. పోలీసులు, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ వారు ఎవరు సకాలంలో స్పందించలేదు. ఇక కాలేజీ నుంచి వెళ్లిపోదామంటే 50 లక్షల రూపాయల బాండ్ గుర్తుకు వచ్చి ప్రీతి ఆగిపోయింది. ఇక చేసేదేం లేక.. వేధింపులు భరించే శక్తి లేక.. అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసి.. ఐదు రోజుల పాటు ఆస్ప్రతిలో మృత్యువుతో పోరాడి.. ఫిబ్రవరి 26 ఆదివారం రాత్రి కన్నుమూసింది.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, కాలేజీ యాజమాన్యం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇక తాజాగా మెడికో ప్రీతి మృతిపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నప్పటికి… అధికారులు దాన్ని కప్పిపుచ్చడంతోపాటు, సైఫ్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాలేజీల్లో ర్యాగింగ్ నిత్యకృత్యమైందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు.
‘‘నేడు కాలేజీలు, ఆఫీసుల్లో ర్యాగింగ్లు, వేధింపులు నిత్య కృత్యం అయ్యాయి. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి తీసుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాటం సాగించి.. వారి విముక్తి కోసం కృషి చేయాలి. ఇందుకోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పోరాటం చేయాలని జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ పిలుపునిస్తోంది’’ అని ఈ లేఖల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.