కన్న కూతురు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి దారుణానికి తెగించాడు. తన కూతురును ప్రేమించిన వ్యక్తితోపాటుగా అతని స్నేహితుల ఇళ్లకు కూడా నిప్పుపెట్టాడు. జిల్లా వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది.
ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు సర్వ సాధారణమై పోయాయి. కులం కన్న గుణం ప్రధానమని భావిస్తున్నారు. తమ పిల్లలు ప్రేమించిన విషయం తెలియగానే కొందరు పెద్దవారు విశాల హృదయంతో వారికి పెళ్లి చేసి ఆశీర్వదిస్తున్నారు. మరికొందరు పరువు కోసం ప్రాకులాడుతూ ప్రాణాలను తీస్తున్నారు. ప్రేమించిన వారిపై రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురు చూసి దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటిదే వరంగల్ జిల్లాలో కూతురి ప్రేమ వివాహం జీర్ణించుకోలేక అమ్మాయి తండ్రి ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టాడు. అంతటితో ఊరుకోక అతని స్నేహితుల ఇంటికి కూడా నిప్పు పెట్టి కాల్చి బూడిద చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్కు కూతురు ఉంది. ఆమె పేరు కావ్యశ్రీ. ఆ అమ్మాయి హాసన్పర్తిలోని ఓ హాస్టల్ లో ఉండి చదువుకుంటుంది. అదే గ్రామానికి చెందిన రంజిత్ అనే యువకుడితో ప్రేమలో పడింది కావ్య. వారు కొంతకాలం ప్రేమించుకున్న
తర్వాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇద్దరి కుటుంబసభ్యులు పెళ్లికి నో చెప్పారని ఇంట్లో తెలియకుండా ఇటీవల రంజిత్, కావ్యశ్రీ పెళ్లి చేసుకున్నారు. వీరి గ్రామానికి చెందిన కొంతమంది స్నేహితుల సహకారంతో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం కావ్య తండ్రికి తెలిసింది. కోపంతో సర్పంచ్ రవీందర్ రగిలిపోతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
తన కూతురును ప్రేమ పేరుతో మాయచేసి వివాహం చేసుకున్నాడని రంజిత్ పై ఫిర్యాదు చేశాడు. రవీందర్ ఇచ్చిన పిర్యాదుకు స్పందించిన పోలీసులు.. కావ్య, రంజిత్ లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. తన కూతురును తనతో రమ్మని రవీందర్ చాలా బ్రతిమిలాడాడు. కానీ కావ్య రంజిత్ తో ఉండడానికే ఇష్టపడింది. దీనితో రవీందర్ రంజిత్ పై మరింత కసి పెంచుకున్నాడు. గ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటికి నిప్పు పెట్టి కాల్చేశాడు. అంతటితో ఊరుకోక వారి పెళ్లికి సహకరించిన స్నేహితుల ఇళ్లకు కూడా నిప్పుపెట్టి దగ్ధం చేశాడు.
గ్రామస్థులు, రంజిత్ స్నేహితులు అందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధతుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులు ఇళ్లు కాలిపోవడంతో నిరాశ్రయులయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఇళ్లను తగులబెట్టిన ఈ ఘటన ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపుతుంది.