హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్డౌన్ అనంతరం గ్రేటర్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో లక్ష మార్కును కూడా దాటకపోవడం గమనార్హం. ప్రస్తుతం రోజుకు 5 కోట్ల రూపాయల నష్టంతో మెట్రో నెట్టుకొస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఇటీవల మెట్రో రైల్ నిర్వాహకులైన ఎల్ అండ్ టీ అధికారులు సీఎం కేసీఆర్ ను కలిశారు. నష్టాల్లో కూరుకుపోయిన మెట్రో రైల్ ను ఆదుకోవాలని కోరారు. దీంతో రాయితీ ఒప్పందం ప్రకారం ఏం చేయవచ్చనే దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం, మెట్రో రైల్ కార్యాలయాన్ని కేసీఆర్ కోరారు.
ఈ ఏడాది రూ. 400 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నష్టాలు రూ. 1,500 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని మెట్రో రైల్ అధికారులు సీఎంని కోరారు.