ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అని వేదమంత్రాల సాక్షిగా ఒక్కటై ఏడడుగులు నడిచారు. ఒకరికొకరు తోడునీడగా నిల్చున్నారు. కష్టసుఖాలను సమానంగా పంచుకున్నారు. మరణంలో కూడా ఈ దంపతుల బంధం వీడిపోలేదు. కడవరకూ భార్యభర్తల అనుబంధానికి నిదర్శనంగా బతికిన ఆ దంపతులను మృత్యువు విడదీయలేకపోయింది. భార్య మరణించిన కొన్ని గంటలకు భర్త కూడా ప్రాణాలు విడిచిన ఘటన హృదయాలను కలచి వేస్తుంది. గంట వ్యవధిలోనే భార్యా, భర్తలు మృతి చెందడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.
ఈ విషాద ఘటన ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలకేంద్రంలోని తాళ్లపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. మాసపత్రి రాజయ్య(75), అతని భార్య స్వరూప (70) తాళ్లపాడులో నివాసం ఉంటున్నారు. ఇటీవల రాజయ్య భూపాలపల్లి సింగరేణిలో కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. శుక్రవారం ఉదయం హఠాత్తుగా స్వరూపకు గుండెపోటు రావడంతో మృతిచెందింది. పెళ్లైన నాటి నుంచి తోడూ నీడగా ఉంటున్న భార్య కానరాని లోకాలకు వెళ్లిందన్న భాద జీర్ణించుకోలేని రాజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఇదీ చదవండి : విషాదం: పోలీసుల కాల్పుల్లో బాలిక దుర్మరణం
భార్య మృతిచెందిన కొద్ది గంటల తరువాత రాజయ్యకు కూడా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ కుటుంబం దుఖఃసాగరంలో మునిగిపోయింది. భార్య మృతిచెందిన గంటలోపే భర్త మృతిచెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.