బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడగా.. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. కొంతమందితో కలిసి ఎల్లారెడ్డి పేటకు బయలుదేరారు. బీజేపీ కేడర్ను పరామర్శించేందుకు వెళ్తున్న రాజాసింగ్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇక.. బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్త తోట ఆగయ్యను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక మంత్రిగా ఆగయ్యను పరామర్శించేందుకు రాలేదు, ఒక కార్యకర్తగా, ఒక కుటుంబ సభ్యునిగా పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. బీజేపీలో అసమ్మతి, పార్టీలో లుకలుకల వల్లనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, అక్కసుతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని దుయ్యబట్టారు.
బడుగు బలహీన వర్గాల మీద యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని నమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పిలుపునిస్తే బీజేపీ బలమెంత? అని ప్రశ్నించారు. మీరు(బీజేపీ) దాడులు చేసి మమ్మల్ని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపైన దాడులకు దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు మంది ఉన్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.