ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవల వరుస బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది. దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోంది. ఇటీవల టారిఫ్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం గప్చుప్గా కొత్త ప్యాక్ను వాల్యూ కేటగిరీలో యాడ్ చేసింది జియో. ప్రీపెయిడ్ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది రిలయన్స్ జియో.
ఇంత వరకు ఏ టెలికాం నెట్వర్క్ కూడా ఈ ధరకు ప్లాన్ను తీసుకురాలేదు. అయితే ఒక్క రూపాయి జియో ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే లభించే ప్రయోజనాలు ఏంటంటే.. 100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్తో ఇంటర్నెట్స్పీడ్ అందుతుంది. జియో కొత్త ప్లాన్ మైజియో యాప్లో ప్రారంభమైంది. న్యూ రీచార్జ్ లోకి వెళ్లాక అదర్ ప్లాన్స్ సెక్షన్ లో ఈ ప్లాన్ ఉంది. అక్కడ రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే వెబ్సైట్లో ఇంకా ఈ ప్లాన్ను జియో అప్డేట్ చేయలేదు. ప్రస్తుతం జియో 1జీబీ డేటా యాడ్ఆన్ ప్యాక్ ధర రూ.15గా ఉంది. అదే ఈ రూ.1 ప్లాన్ పదిసార్లు రీచార్జ్ చేసుకుంటే ఆ మొత్తం డేటా రూ.10కే వస్తుంది.
ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్కే దక్కింది. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. తాజాగా జియో నిర్ణయంపై వినియోగదారులు ఖుషీ అవుతున్నారు.