పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నారు కొంత మంది చిన్నారులు. ఆట పాటల్లోనే కాదూ చదువులోనూ దూసుకెళుతున్నారు. చిన్నవయస్సులోనే పెద్ద ఆలోచన చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పిట్ట కొంచెం కూత ఘనం అని నిరూపిస్తున్నారు కొంత మంది చిన్నారులు. ఆట పాటల్లోనే కాదూ చదువులోనూ దూసుకెళుతున్నారు. చిన్నవయస్సులోనే పెద్ద ఆలోచన చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువుతో కూడిన తెలివితేటలతో నూతన ఆవిష్కరణలు చేసి అబ్బుర పరుస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు బుర్రకు పదును పెట్టి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. రాష్ట్రపతి ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఇప్పుడు ఓ పదో తరగతి అమ్మాయి.. ప్రాణాలు నిలబెట్టే ప్రయోగాన్నిరూపొందించి ప్రశంసలతో పాటు అవార్డులు పొందింది. ఈ అమ్మాయి మన తెలంగాణ వాసే. ఇంతకు ఆ చిన్నారి ఏమీ రూపొందించిందంటే..?
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన పూజ శ్రీ అనే విద్యార్థిని తయారు చేసిన ఓ ఆవిష్కరణ రాష్ట్ర, జాతీయ అవార్డులను సొంతం చేసుకుని, రాష్ట్రపతి ప్రశంసలు పొందింది. ఇంతకు ఆ బాలిక చేసిన ప్రయోగం ఏంటంటే.. బస్ యాక్సెస్ కెమెరా. ఆల్ఫోర్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది పూజశ్రీ. ఓసారి తన ఇంటి దగ్గర ఉన్న ఓ వ్యాన్ నిలిపి ఉంచగా.. ఓ జంతువు దాని కింద పడుకుంది. అయితే ఆ విషయం తెలియని డ్రైవర్.. వాహనాన్ని తీసే సమయంలో జంతువును తొక్కించడంతో అది చనిపోయింది. అది చూసిన పూజ శ్రీ చలించిపోయి.. ఈ మరణాలను తగ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేసింది. తన ఆలోచనను ఉపాధ్యాయులకు చెప్పి యాక్సెస్ కెమెరాను ఆవిష్కరణ చేసింది. ఆ ఆవిష్కరణ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నుండి ప్రశంశలు కురిపించాయి.
విద్యార్థిని పూజశ్రీ ఆవిష్కరించిన యాక్సెస్ కెమెరాకు ఎన్సీఎస్ అవార్డ్ దక్కింది. బెంగుళూరులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవార్డ్, జపాన్ లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంతకు ఈ యాక్సెస్ ఎలా పనిచేస్తుందో ఆ మాటల్లో..ఈ యాక్సెస్ కెమెరాని బస్ లేదా ఇతర వాహనాల ముందు కింద భాగంలో పెడితే.. ముందు టైరు నుండి వెనుక టైరు వరకు ఏమున్నా క్లియర్ గా వాహనాల్లో ఉన్న డిసిప్లేలో కనిపిస్తుంది. అప్పుడు బస్సు కింద ఏదైనా జీవి నిద్రిస్తున్నా ఈజీగా తెలిసిపోతుంది. దీంతో జీవి ప్రాణాలను కాపాడినట్లు అవుతుందని పూజ శ్రీ తెలిపింది. తాను తయారు చేసిన ఈ యాక్సెస్ కెమెరాకు మంచి గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తుంది పూజశ్రీ. ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని ఉపయోగపడే అవిష్కరణలు చేపట్టేందుకు కృషి చేస్తూనే ఉంటానని తెలిపింది. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా పూజశ్రీని రాష్ట్రపతి ప్రశంసించారు.