డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు సెలెక్షన్ విషయంలో భారత్ తప్పు చేసిందన్నాడు ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్. రోహిత్ అనవసరంగా ఒక ట్రాప్లో పడ్డాడన్నాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. మొదట్లో వికెట్లు తీసి ఆశలు రేకెత్తించడం, ఆ తర్వాత చేతులెత్తేయడం భారత బౌలర్లకు ఎప్పటి నుంచో ఉన్న బలహీనత. దీన్నే మరోసారి రిపీట్ చేశారు. పేస్కు అనుకూలించే పిచ్ మీద భారత పేసర్ల ధాటికి ఒకదశలో 76/3తో ఆసీస్ కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత 62 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు.. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పవర్ హిట్టింగ్తో ఆదుకున్నాడు ట్రావిస్ హెడ్. స్టీవ్ స్మిత్ (95 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోవడం, ట్రావిస్ హెడ్ (146 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆటలో కంగారూలదే పైచేయి అయింది. ఫస్ట్ డే ఆట ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్లకు 327 రన్స్ చేసింది. తొలి రోజు ఆటలో భారత్ పూర్తిగా తేలిపోయింది.
ఈ నేపథ్యంలో భారత జట్టు సెలక్షన్పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న పాంటింగ్.. టీమిండియా నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ కోసమే భారత్ తుది జట్టును సెలక్ట్ చేసినట్లుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. రోహిత్ శర్మ ట్రాప్లో పడ్డాడని.. తొలి ఇన్నింగ్స్కు మాత్రమే ఉపయోగపడే పేస్ అటాక్ కోసం కీలక బౌలర్ను పక్కన పెట్టారన్నాడు పాంటింగ్. ఆసీస్ టీమ్లో నలుగురు లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారని తెలిసి కూడా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు జట్టులోకి తీసుకోకపోవడం షాక్కు గురిచేసిందన్నాడు. ఈ ఒక్క తప్పే భారత్ కొంప ముంచిందన్నాడు పాంటింగ్. అశ్విన్ టీమ్లో ఉంటే మ్యాచ్ సాగుతున్న కొద్దీ కీలకంగా మారేవాడని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మరి.. అశ్విన్ను ఆడించకుండా భారత్ తప్పు చేసిందంటూ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.