భారత క్రికెట్ జట్టులో ప్రక్షాళన చేయాల్సిందేనని టీమిండియా మాజీ హెడ్ కోచ్ అన్నాడు. సీనియర్ ప్లేయర్లు రిటైర్ అయ్యే వరకు ఆగొద్దని.. వాళ్లను అవసరమైతే వెంటనే తీసేయాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఏ రంగంలోనైనా గెలుపోటములు అనేది కామన్. విజయం వస్తే ఎగిరి గంతేయడం కాదు.. పరాజయం వచ్చినా అంతే హుందాగా తీసుకోవాలని పెద్దలు అంటుంటారు. అయితే ఇది అంత సులభం కాదు. ముఖ్యంగా సినీ, క్రీడా రంగాల్లో ఇది చాలా కష్టం అనే చెప్పాలి. సినీ తారలు, క్రీడాకారుల కంటే కూడా వారి ఫ్యాన్స్ ఓటమిని అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు అభిమానుల పరిస్థితి అలాగే ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. స్టార్ ప్లేయర్లతో నిండిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోవడంతో వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. టీమ్ సెలెక్షన్లో లోపాలు, బ్యాటర్ల షాట్ సెలెక్షన్లో తప్పులు, సరైన ప్రాక్టీస్ లేకపోవడం, సన్నాహకాలకు సమయం కేటాయించకపోవడాన్ని ఈ ఓటమికి కారణాలుగా చెబుతున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీ ఫెయిల్యూర్ కూడా ఒక కారణమని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. రోహిత్ సహా బ్యాటింగ్లో ఫెయిలైన పుజారా, కేఎస్ భరత్ లాంటి వారిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఫ్యూచర్ కోసం ఆసీస్ తరహా ప్లానింగ్తో భారత్ ముందుకెళ్లాలన్నాడు. టీమ్ను ప్రక్షాళన చేయాల్సిందేనన్నాడు. భవిష్యత్తు అవసరాల కోసం యంగ్ ప్లేయర్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. 30 సంవత్సరాలు దాటిన రోహిత్ శర్మ, అజింక్యా రహానె, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా లాంటి ప్లేయర్లు రిటైర్ అయ్యే వరకు ఎదురు చూడొద్దన్నాడు.
అవసరమైతే సీనియర్లను జట్టులో నుంచి తీసేయాలని సలహా ఇచ్చాడు రవిశాస్త్రి. టీమ్లో కొందరు సీనియర్లతో పాటు ఎక్కువ మంది యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలన్నాడు. అప్పుడే సీనియర్ల నుంచి యువ ఆటగాళ్లు త్వరగా నేర్చుకొని వారికి రీప్లేస్మెంట్గా తయారవుతారని రవిశాస్త్రి పేర్కొన్నాడు. యువ ప్లేయర్ల కోసం సీనియర్లను పక్కన పెట్టేందుకు మొహమాట పడొద్దని స్పష్టం చేశాడు. అందుకు కంగారూ టీమ్ను ఉదాహరణగా చెప్పాడు రవిశాస్త్రి. ఇప్పటికిప్పుడు జట్టులో నుంచి ఐదుగురు సీనియర్లను పక్కనపెట్టమన్నా దానికి ఆస్ట్రేలియా సిద్ధంగా ఉంటుందని వివరించాడు. రాబోయే మూడేళ్లలో ఏం చేయాలనే విజన్ ఉండాలని.. అందుకు తగ్గట్లుగా ప్లాన్స్ అమలు చేసుకుంటూ వెళ్లాలని రవిశాస్త్రి సూచించాడు. మరి.. టీమిండియాలో ప్రక్షాళన చేయాల్సిందేనంటూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.