మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా భారీ విజయం సాధించిన విశయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సత్త చాటిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో టెస్టు మ్యాచ్ మొత్తంలో అతడే హైలెట్ అంటూ ఆకాశానికెత్తాడు. డబుల్ సెంచరీ చేసేందుకు వీలున్నా జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆలోచించాడని కొనియాడాడు.
ఈ మ్యాచులో జడేజా.. మొదట బ్యాటింగ్ లో 175 పరుగుల(17 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో రాణించగా.. తర్వాత బంతితోనూ చెలరేగాడు. లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్లో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి.. దేశీయ పిచ్ లపై తనెంత ప్రమాదమో మరోసారి నిరూపించాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. జడేజా డబుల్ సెంచరీకి మరో 25 పరుగుల దూరంలో ఉండగా భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్కు దిగారు.
ఈ విషయంపై జడేజా ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. శ్రీలంకఆటగాళ్లు బాగా అలసిపోయారని.. తాము వికెట్లు పడగొట్టేందుకు పిచ్ కూడా అనుకూలిస్తుందన్న నేపథ్యంలో డిక్లేర్ చేయమన్నట్లు వెల్లడించాడు. మ్యాచ్ విజయానంతరం రోహిత్ శర్మ సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నపుడు జడేజానే ముందుకు వచ్చి డిక్లేర్ చేయమని చెప్పాడన్నాడు. తను నిస్వార్థపరుడంటూ కితాబిచ్చాడు. కాగా.. శ్రీలంకతో తొలి టెస్టులో ఇన్నింగ్స్, 222 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు బెంగుళూరు చిన్నస్వామి వేదికగా మార్చి 12 నుంచి మొదలుకానుంది.
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్.. కెప్టెన్ రోహిత్ శర్మ
టెస్టు ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్ అంటూ కొనియాడాడు. అశ్విన్ ఈ రికార్డు సాధించడం గొప్ప విషయం అని, అతడిని చాలా ఏళ్లుగా గమనిస్తున్నానని, ప్రతిసారి మెరుగవుతూనే ఉన్నాడని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగానే కాకుండా జట్టుకు కూడా రికార్డులు అందించే సత్తా అశ్విన్లో ఉందని రోహిత్ ప్రశంసించాడు. అలాగే వందో టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ కోసమే ఈ మ్యాచ్ గెలవాలనుకున్నామని రోహిత్ తెలిపాడు.
4⃣3⃣6⃣ Test wickets and counting 👏👏
A special milestone 🔥
Way to go, @ashwinravi99 🌟🔝#TeamIndia #INDvSL @Paytm pic.twitter.com/zUh884t3m3
— BCCI (@BCCI) March 6, 2022