మంగళవారం దుబాయి వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో అనూహ్యంగా రాజస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయలేక.. 2 పరుగుల తేడాతో మ్యాచ్ను రాజస్థాన్కు సమర్పించుకున్న పంజాబ్ టీమ్పై తాజాగా కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాబ్- రాజస్థాన్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందా అన్న అనుమానం, ప్రశ్నలు వెల్లువెత్తాయి. మ్యాచ్లో దీపక్ హుడా పెద్దగా ప్రదర్శన చేయకపోయినా.. అతని పేరు మరో విషయంలో బాగా వినిపిస్తోంది. మ్యాచ్కు కొన్ని గంటల ముందు దీపక్ హుడా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హెల్మెట్ ధరిస్తున్న ఫొటో ఒకటి పెట్టి హుడా ‘హియర్ వ్యు గో’ అంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుకు సంబంధించి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ రంగంలోకి దిగింది.
ప్లేయర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని. అభిమానులకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారలని ఏసీయూ మాజీ అధికారులు తెలిపారు. దీపక్ హుడా పోస్టులో టీమ్కు సంబంధించిన అంశాలు, టీమ్ ప్లేయర్లు లేకపోయినా.. అతని పోస్టు నిబంధనలు ఉల్లంఘించినట్లేనా అన్న కోణంలో అధికారులు విచారణ చేయనున్నారు. ఈ ఒక్క పోస్టుతో దీపక్ హుడా అధికారుల సర్వేలైన్స్లోకి చేరాడు. సాధారణంగా అందరి పోస్టులను పరిశీలించే అధికారులు దీపక్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి ఏం చేయాలో, ఏం చేయకూడదో ముందే నిబంధనలు క్షుణ్ణంగా ఉన్నాయి.
ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయం కోసం 4 పరుగులు చేయాల్సి ఉంది. అందరూ ఫిక్స్ అయిపోయారు పంజాబ్ విజయం ఖాయమని. అప్పటికే ఫుల్ ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్(22 బంతుల్లో32 పరుగులు) కొట్టేస్తాడని భావించారు. కానీ, ఆఖరి ఓవర్ మూడో బంతిని కనెక్ట్ చేయబోయి నికోలస్ పూరన్.. సంజూ శాంసన్కు చిక్కాడు. అతని తర్వాతి స్థానంలో వచ్చిన దీపక్ హుడా నాలుగో బంతిని ఎర్లీగా రియాక్ట్ అయ్యి మిస్ చేశాడు. తర్వాత ఆఖరి ఓవర్ ఐదో బంతిని షాట్ ఆడబోయి టాప్ ఎడ్జ్ తీసుకుని హుడా శాంసన్కు చిక్కాడు. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉండగా ఫాబియన్ అలెన్ ఆఖరి బంతికి ఒక్క పరుగు కూడా చేయలేదు. మొత్తం ఈ మ్యాచ్ జరిగిన తీరును చూసి అభిమానులు, విశ్లేషకుల్లో కొంత అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. దీపక్ పోస్టు వివాదంతో ఫిక్సింగ్ అన్న మాటలు వెలుగులోకి వచ్చాయి.
పంజాబ్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.