టీమిండియా గురించి చెప్పమంటే అందరూ ఆహా ఓహో అని అంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్స్, బౌలర్లు మన జట్టులో ఉన్నారు. అయితే ఐసీసీ కప్ అందుకుని మాత్రం దాదాపు పదేళ్లు అయిపోతుంది. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు జస్ట్ ఆరేళ్ల వ్యవధిలో మూడు ఐసీసీ ట్రోఫీలు.. మనం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ లిస్టులో టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. 2013 తర్వాత నుంచి మన జట్టు టోర్నీల్లో పాల్గొంటున్నప్పటికీ.. చివరి మెట్టుపై బోల్తా కొడుతోంది. ఈసారి మాత్రం అది మిస్ అయ్యేలా అస్సలు కనిపించట్లేదు. కోచ్ ద్రవిడ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇది నిజమేనేమో అనిపిస్తున్నాయి.
ఇక విషయానికొస్తే.. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించారు. అయితే ద్వైపాక్షిక సిరీసులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లోనూ మన జట్టును గెలిపించిన రికార్డు విరాట్ అందుకున్నాడు. కానీ వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో మాత్రం సెమీస్ లో చేతులెత్తేశారు. దీంతో 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీని తప్పించి రోహిత్ కు బాధ్యతలు అప్పగించారు. అయినా సరే పెద్దగా మార్పేం రాలేదు. దీంతో ఈ ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తో పాటు 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ మనకు చాలా కీలకం. ఈ క్రమంలోనే క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఇక తాజాగా న్యూజిలాండ్ తో మూడో వన్డేకు ముందు మాట్లాడిన కోచ్ ద్రవిడ్.. ‘పనిభారం ఎక్కువ కాకుండా చూసుకోవడం ఆటలో భాగం. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, విరాట్, రాహుల్ కు పలు సిరీసులకు రెస్ట్ ఇచ్చాం. వర్క్ లోడ్, గాయాలని పర్యవేక్షించడం రెండు డిఫరెంట్. కానీ వాటిని సమప్రాధాన్యం ఇస్తున్నాం. స్టార్ క్రికెటర్లకు గాయాల బెడద ఉంటే ఐపీఎల్ లో ఆడరు. నేషనల్ క్రికెట్ అకాడమీ, బీసీసీఐ మెడికల్ టీమ్.. స్టార్ క్రికెటర్ల గాయాలని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూనే ఉంది. వన్డే వరల్డ్ కప్ ప్లాన్ లో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడి సత్తా టెస్టు చేసుకునే అవకాశముంది. అయితే ఎలాంటి గాయాలు లేకపోతేనే వాళ్లని ఐపీఎల్ లో ఆడిస్తాం’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తుంటే.. ఏ చిన్న గాయం ఉన్నట్లు అనిపించినా సరే జట్టులోకి స్టార్ ఆటగాళ్లు.. ఐపీఎల్ సీజన్ మొత్తానికే ఆడకపోవచ్చనిపిస్తోంది.