పండుగపూట కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగానే సాగాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే.. తాను కుప్పంలో చంద్రబాబు మీద పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయిందని.. ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటుగా స్పందించారు. తనపై చంద్రబాబు నోటికి వచ్చినట్లు కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. పుంగనూరులో చంద్రబాబు ఏం పీకలేడని.. కుప్పంలో ఆయన జెండాను శాశ్వతంగా పీకేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాక సీఎం జగన్ ఆదేశిస్తే.. వచ్చే ఎన్నికల్లో తాను రెండు చోట్ల పోటీ చేసేందుకు రెడీ అని తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ సారి కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమే. తన మానసిక పరిస్థితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఒకసారి వైద్యులను కలిసి చూపించుకుంటే మంచిది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. టీడీపీ జెండాను మోయమని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అజెండా అప్పగించాడు. తాను ప్రజల కోసం పనిచేస్తుంటే.. చంద్రబాబు సొంత మనుషుల కోసం పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు జెండాను పీకేస్తాం’’ అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వచ్చి పదేపదే తన గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నిజంగానే కుప్పంలో పెద్దిరెడ్డి పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.