డిసెంబర్ 7 నుంచి 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు వైసీపీ పార్టీ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తేందుకు వైసీపీ పార్టీ సిద్ధమైంది. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా డిమాండ్ ను పార్లమెంటులో సంధించనున్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.
విభజన చట్టంలోని పెండింగ్ లో ఉన్న అంశాలను అమలు చేయడమే వైసీపీ పార్టీ ప్రధాన అజెండా అని మార్గాని భరత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో.. కేంద్రం ఆరోజు ఏ అంశాలైతే పొందుపరిచిందో.. అవన్నీ రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలానే పోలవరం నిధులు, రూ. 18 వేల కోట్ల రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులు, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ అంశాల గురించి కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తామని భరత్ అన్నారు.