ఇప్పటం గ్రామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళు కూల్చారని జనసేన అంటుంటే.. అసలు ఇళ్లే కూల్చలేదని వైసీపీ అంటోంది. ఇప్పటికే ఇప్పటం ఇళ్ల కూల్చివేత విషయంలో అబద్ధం చెప్పినందుకు ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024లో వైసీపీని గెలవనివ్వనని సవాలు విసిరారు.
తాను అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పటం ఇళ్ల కూల్చివేతల వెనుక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చట్ట ప్రకారంగానే వైసీపీ నేతల ఇళ్లను కూలుస్తామని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాలు విసిరారు. తనది రౌడీ సేన పార్టీ కాదని, విప్లవ సేన అని అన్నారు. వైసీపీ వాళ్లకి తాము రౌడీలుగా కనిపించినా.. ప్రజల దృష్టిలో తాము విప్లవకారులమని అన్నారు. ఇప్పటం గ్రామ ప్రజలకు తాను అండగా ఉంటానని,వైసీపీ చేసిన గాయానికి జనసేన మందు రాస్తుందని అన్నారు.