ఏపీలో ప్రస్తుతం మారుమోగుతున్న పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా సొంత పార్టీ మీదనే తిరుగుబావుట ఎగురవేసి చర్చనీయాంశంగా మారారు. తాజాగా రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులు కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ నాగరాజు చేసిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంలో తన అభిప్రాయమేంటో అనేది వెల్లడించారు. రాజధాని విషయంలో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ నిర్ణయానికి ఇన్నాళ్లు కట్టుబడి ఉన్నానని.. అయితే వ్యక్తిగా తాను మాత్రం మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. విశాఖను రాజధానిగా చేయాలంటూ ఆయన సూచించారు.
నూటికి నూరు శాతం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కోరిక ఇప్పటిది కాదని, 2019 ఎన్నికల ముందు నుంచి కూడా ఉందని కోటంరెడ్డి అన్నారు. అయినా ఈ కోరిక తనదొక్కడిదే కాదని.. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి అసెంబ్లీలో మద్దతు పలికారని గుర్తు చేశారు. ఆనాడు అసెంబ్లీలో అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శాసన రాజధాని, పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని.. మూడు రాజధానులు ఉంటాయని చెప్పడం కరెక్ట్ కాదని తన అభిప్రాయమని అన్నారు.
ఇక అమరావతికి ఒక చరిత్ర ఉందని అన్నారు. అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు ఇవ్వడం జరిగిందని.. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ వెళ్తే.. మన రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని ఉంటుందని ఆరోజు ప్రతిపక్షంలో అన్నప్పుడు.. ఈరోజు ఎందుకు దానిపై దృష్టి సారించడంలేదని అన్నారు. ‘ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. ఏమీ లేని అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే కంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో రాజధాని నిర్మిస్తే బాగుంటుందనే కదా ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయం’ అని జర్నలిస్ట్ నాగరాజు అన్నారు.
దానికి కోటంరెడ్డి బదులిస్తూ.. ‘ఒకవేళ ఆ ఆలోచన ప్రకారం చేసి ఉంటే.. నేరుగా విశాఖపట్నమే రాజధాని. ఒకే రాజధాని.. ఇన్ని రాజధానులు కాదు.. ఒకే రాజధాని నిర్మించండి’ అంటూ వెల్లడించారు. తాను మూడు రాజధానులకు వ్యతిరేకమని ఆయన చెప్పుకొచ్చారు. ఒకే రాజధాని ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అమరావతి రాజధానిగా ఉండాలి లేదా విశాఖ రాజధానిగా ఉండాలి కానీ మూడు రాజధానులు ఉండడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి రాజధాని విషయంలో కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. ఇక వికేంద్రీకరణపై ఇంత ద్వేషం పెట్టుకుని ఎందుకు ఇన్నాళ్లు వైసీపీలో ఉన్నారన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. పార్టీ నుంచి బయటకు రావడానికి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వంటి విషయాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫుల్ వీడియో కింద ఉంది చూడగలరు.