సమయం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ సర్కార్పై తనదైన శైలిలో విరుచుకుపడే ప్రముఖ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఇటీవలే బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన.. త్వరలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించి సంలచనం సృష్టించగా.. తాజా ప్రకటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిన్న నిర్వహించిన ‘7200 మూవ్మెంట్’ సన్నాహక సమావేశానికి హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని ప్రకటించారు. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్మెంట్’ ద్వారా పోరాడతానని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Teenmaar Mallanna:ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి.. కొత్త పార్టీ పెడుతున్నా: తీన్మార్ మల్లన్న
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేయటం నా విధానం కాదు. ప్రజా చైతన్యానికే మా పోరాటం. విద్యావంతులైన బాల్క సుమన్, గ్యాదరి కిషోర్లకు విద్యాశాఖను అప్పగిస్తే బాగుంటుంది. పేదోళ్ల, పెద్దోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో వరుసలో కూర్చొని చదువుకోవాలన్నదేమాతమ మూవ్మెంట్ లక్ష్యమని’’ చెప్పుకొచ్చారు. అకాల వర్షాలొచ్చి రాష్ట్రమంతటా రైతులు ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం వ్యవసాయ క్షేత్రం విడిచి బయటకు రావడం లేదని మల్లన్న అన్నారు. యాదాద్రిలో రూ.వందల కోట్లు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలివానకే తేలిపోయిందని విమర్శించారు. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ రెండో వారంలో చేపట్టే ప్రజా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. మొన్నటి వరకు కేసీఆర్ అంటేనే ఓ రేంజ్లో ఫైర్ అయ్యే.. తీన్మార్ మల్లన్న నోటి నుంచి ఇలాంటి మాట రావడంతో.. కొంపదీసి.. త్వరలోనే కారెక్కుతారా.. లేక ప్రభుత్వంపై నోరు పారేసుకుంటే.. కేసులు పెట్టి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అని జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. మరి తీన్మార్ మల్లన్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Assam Lady SI: మరి కొద్ది నెలల్లో వివాహం.. కాబోయే భర్తను అరెస్ట్ చేసిన మహిళ!