జగన్ మోహన్ రెడ్డి… తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఇప్పుడు ఒక ప్రభంజనం. జగన్ ప్లాన్ వేస్తే ప్రత్యర్థులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఇంత చతురత ఉంది కాబట్టే.. ఒంటరిగా మొదలైన జగన్ ప్రయాణం.., ఈనాడు 151 సీట్లకి చేరింది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా జగన్ ఓ బలమైన శక్తి. జగన్ చుట్టూ కేసులు, బెయిల్ లు, ఆరోపణలు అంటూ ఎన్ని ఇష్యూలు ఉన్నా.., కేంద్ర పర్యటనకి వెళ్లిన ప్రతిసారి పెద్దలు జగన్ కి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం కూడా ఇదే. జగన్ కూడా కేంద్రంతో చక్కగా ఉంటూనే.., తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలో కూడా ఇదే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏపీ నుండి ఖాళీ కానున్నాయి.
విజయ సాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు స్థానాలు ఇవి. ఈ నాలుగు కూడా ఇప్పుడు వైసీపీ స్థానాలే కానున్నాయి. వీటిలో విజయ సాయి రెడ్డి పదవి కాలం రెన్యూల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సీట్లలో పారిశ్రామిక వేత్త ఆదానీకి ఒకటి, ఐఏస్ అధికారి కిషోర్ రావుకి ఒకటి ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కూడా బీజేపీ అభ్యర్ధనకి జగన్ అంగీకారం తెలిపి ఇస్తున్నవే. ఇక జగన్ చేతిలో మిగిలింది ఒకే ఒక్క సీటు. అయితే.., ఇప్పుడు ఈ ఒక్క సీటు విషయంలో జగన్ మాస్టర్ ప్లాన్ కాకుండా, మెగా ప్లాన్ వేస్తున్నాడట.
ఏపీలో ఉన్న కాపు సామజిక వర్గానికి దగ్గర అవ్వడానికి మెగాస్టార్ ని రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు బీజేపీ, జనసేన కలసి కాపు ఓట్లను దక్కించుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనతో మంచిగా ఉంటున్న చిరుని గనుక పెద్దల సభకి పంపగలిగితే కాపులను ఆకర్షించినట్టు అవుతుంది అన్నది జగన్ ఆలోచన. ఇదే సమయంలో అన్నయ్యని తమవైపు ఉంచుకుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ దూకుడికి కూడా కళ్లెం వేయవచ్చని జగన్ భావిస్తున్నారట. అయితే.., చిరంజీవి ఇప్పటికే ఓసారి కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన పెద్దల సభకి పోవడానికి అంగీకరిస్తాడా? లేదా? అన్నది తెలుగు రాజకీయాల్లో చర్చగా మారింది.