నెల్లూరు– ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, చేస్తున్న అభివృద్ది పనులపై సహజంగానే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడం, ఆరోపణలు చేస్తుంటాయి. కానీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ సర్కార్ పై పోరాటమే చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత సర్కార్ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఇళ్లు కొత్తగా పెళ్లయిన జంటలకు శోభనం చేసుకోవడానికి కూడా సరిపోనంత ఇరుకుగా ఉన్నాయని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. నెల్లూరులో జరిగిన గృహ నిర్మాణంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సార్…పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారు.. చాలా బాగుంది.. కానీ బెడ్రూం విషయానికి వస్తే పెళ్లయిన కొత్త జంటలకు శోభనం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్.. చాలా చిన్న బెడ్ రూం.. కొత్తగా పెళ్లయిన జంటలకే కాకుండా, పాతవారికి కూడా నైట్ టైమ్ ఏదైనా పని చేసుకోవాలంటే ఇబ్బందే సార్ అన్నారు.
ఆ బెడ్ రూంలో వేసే మంచం మనం కొలతలు తీసుకొని ప్రత్యేకంగా తయారుచేసి ఇస్తే తప్ప సరిపోదు సార్.. మార్కెట్లో అమ్మే ఫిక్స్డ్ సైజ్ మంచాలు ఆ బెడ్ రూంలకు చాలవు.. నా విన్నపం ఏమంటే బాత్రూంలు బయట కట్టి, బెడ్రూం వెడల్పు చేస్తే బాగుంటుంది సార్.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విన్నవించారు.
అంతే కాదు పట్టణాల్లో నిర్మించే ఇళ్ల విషయానికి వస్తే హాల్లో శోభనం చేసుకొని బెడ్ రూంలో పడుకోవాల్సిందే సార్.. ఇది చాలా అన్యాయం సార్.. పట్టణాల్లో 6 అంకణాల్లో ఇల్లు కడుతున్నారు.. ఎంత ఇల్లు వస్తుంది చెప్పండి సార్.. గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేవిధంగా పట్టణాల్లో కూడా తొమ్మిది అంకణాల్లో ఇల్లు కట్టిస్తే బాగుంటుంది సార్… అని తనదైన శైలిలో వ్యంగంగా సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ చెప్పారు. ఇంతకీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మామూలుగా అలా అన్నారా, లేక కావాలని ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారా అన్నదే ఇప్పుడు వైసీపీ పార్టీలో చర్చనీయాంశమవుతోంది.