ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ దేశం పేరే వినిపిస్తోంది. తాలిబన్స్ ఒక దేశం అంతటిని ఎలా స్వాధీనం చేసుకోగలిగారు? అసలు ఎవరీ తాలిబన్స్? ఆఫ్ఘనిస్థాన్ సైన్యం ఏమైంది? ఈ మొత్తం పాపంలో అమెరికా తప్పు ఉందా? లేదా? నిజంగానే తాలిబన్స్ అంత దుర్మార్గులా? రేపటి రోజున ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
ఆఫ్ఘనిస్తాన్ అంటే.. చుట్టూ పర్వతాలు, భూగర్భంలో నిక్షిప్తం అయ్యి ఉన్న కొన్ని లక్షల కోట్ల ఖనిజ సంపద, సముద్ర తీర ప్రాంతం లేని భూభాగం.. మొత్తం 50,000 సంవత్సరాలకి పై బడ్డ చరిత్ర. కానీ.., చాలా దేశాల్లానే ఆఫ్ఘనిస్థాన్ కూడా బ్రిటీష్ పాలనలో ఉంటూ వచ్చింది. అయితే 1919 ఆగస్టు 8వ తేదీన ఈ దేశానికి స్వాతంత్య్రం లభించింది. కానీ.., ఇదే తరువాత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ పాలిట శాపం అయ్యింది. ఎందుకంటే స్వతంత్రం తరువాత కూడా ఆఫ్ఘనిస్తాన్ లో రాచరిక వ్యవస్థ కొనసాగింది. బ్రిటీష్ వారు పోతు, పోతు బారక్జాయి వంశస్థులకు పరిపాలన అందించి వెళ్లారు. ఇలా రాచరిక కుటుంబాల మధ్య అధికారం చేతులు మారుతూ.., 1978 నాటికి ఆఫ్ఘన్ కమ్యూనిస్ట్ లకి చేతికి అధికారం చిక్కింది. ఇక్కడ నుండే ఆఫ్ఘనిస్తాన్ లోకి బయటి శక్తులు రావడం ప్రారంభమైంది. ఇదే తరువాత కాలంలో ఆ దేశ పతనానికి కారణం అయ్యింది.
ఆఫ్ఘన్ కమ్యూనిస్ట్ లు సవ్యమైన పరిపాలన అందించడంలో విఫలం అయ్యారు. దేశంలో అంతర్గత పోరు ఎక్కువైంది. ఈ పరిస్థితిలను ఆసరాగా చేసుకుని.., ముజాహిదీన్ బలగాలు రెచ్చిపోయాయి. నిజానికి అప్పటి ముజాహిదీన్ బలగాలను ఆఫ్ఘనిస్థాన్ సైన్యం సులభంగానే మట్టి కరిపించేది. కానీ.., ముజాహిదీన్ లకి పాకిస్థాన్ నుండి సహాయం అందుతూ వచ్చింది. పాకిస్థాన్ వెనక ఉండి ఆ ఆయుధ, ఆర్ధిక సహకారం అందించింది అమెరికానే. ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని అమెరికా ఎందుకు కోరుకుంది అంటే..? ఇక్కడ అతి చౌకగా దొరికే పెట్రోల్ ఒక కారణం అయితే.., అపరిమిత సంఖ్యలో ఉన్న ఖనిజ సంపద ఇంకో కారణం. పెద్దన్న దేశం కన్ను వాటిపై పడింది.
పటిష్టమైన నిఘా వర్గం లేని ఆఫ్ఘనిస్తాన్.. అమెరికా కుట్రని ముందుగా గమనించ లేకపోయింది. ప్రత్యర్థి ముజాహిదీన్ బలం అమెరికా అని ఆసల్యంగా తెలుసుకున్న ఆఫ్ఘనిస్తాన్.. సోవియట్ యూనియన్ సహాయం కోరింది. ఎక్కడైనా అమెరికా అధికారానికి చెక్ పెట్టడమే సోవియట్ యూనియన్ కి కావాల్సింది. దీంతో.., సోవియట్ యూనియన్ లక్ష మంది సైన్యాన్ని 1979, డిశంబర్ 24న ఆఫ్ఘనిస్థాన్ కి పంపింది. ఇంకో లక్ష మంది ఆఫ్ఘానిస్తాన్ సైన్యం కూడా కలిపి.., వీరి సంఖ్య 2 లక్షలు అయ్యింది.
మరోవైపు అమెరికా సహాయంతో ముజాహిదీన్ సైన్యం కూడా బలపడింది. ఈ రెండు బలగాల మధ్య 10 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. ఈ అంతర్గత కుమ్ములాటలో ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్ చేరి.., ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకి శాంతిని దూరం చేశాయి. ఈ సుదీర్ఘ పోరు కారణంగా.., 10 ఏళ్ళ కాలంలో కనీసం 15 లక్షల మంది సామాన్య ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ప్రపంచ దేశాలన్నీ అప్పటి ఆఫ్ఘానిస్తాన్ లో శాంతి కోసం ప్రయత్నాలు చేశాయి.కానీ.., అమెరికా ఎవరి మాట వినలేదు. సోవియట్ యూనియన్ మాత్రం ఒక అడుగు వెనక్కి తగ్గింది. ఆఫ్ఘనిస్థాన్ నుండి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించింది. అమెరికా ఇది తమ విజయంగా భావించి..,ఇక మోజాహిదీన్ కి సహాయం అందించడం మానేసింది. 1992 వరకు సాగిన నజీబుల్లా ప్రభుత్వం కూడా పడిపోయింది.
1992 తరువాత ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా దళాలు లేవు, సోవియట్ యూనియన్ సైన్యం లేదు, మోజాహిదీన్ బలం లేదు, యుద్ధం అసలే లేదు. కానీ.., ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్ ని పట్టి పీడించింది మాత్రం దారిద్య్రం. 10 ఏళ్ళ పాటు సాగిన యుద్ధం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. విద్యావంతులు, మేధావులు చాలామంది పక్క దేశాలకి వలస పోయారు. దేశానికి సరైన నాయకత్వం కొరవడింది. తెగలు, తెగలుగా పరిమిత ప్రాంతాలకు నాయకులు పుట్టుకొచ్చారు. ఆ కొంత భూభాగం అంతా.. ఆ తెగ చేతుల్లో ఉంటుంది అనమాట. దేశానికి ఆదాయం లేదు. ప్రజలకి ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేవు. అసలు దేశంలో ఎలాంటి ఉత్పత్తి లేకుండా పోయింది. దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో అన్నీ తెగలను ఒక్కటి చేసి, దేశానికి సరైన పరిపాలన అందించే న్యాయకత్వం అవసరం అయ్యింది. అప్పుడు పుట్టుకొచ్చారు తాలిబన్స్.
వీరంతా ఆఫ్ఘన్ లోని గురుకులాలో విద్యార్థులు. కొంత మంది వీరి గురువులు.1994 లోని ఘర్షణలో కాబూలులో 10,000 మంది పైగా మరణించారు. ఆ సమయంలో తాలిబన్స్ దేశంలో శాంతి కోసం కృషి చేశారు. అన్నీ తెగలను నిర్వీర్యం చేశారు. తామే నాయకులుగా ఎదిగారు. అప్పుడు ప్రజల అవసరాలు కూడా తీర్చారు. ఉద్యోగ, ఉపాధి మార్గాలు పెంపొందించారు. దేశంలో ఖనిజ సంపదని సరిగ్గా ఉపయోగించుకుని మళ్ళీ దేశాన్ని అన్నీ విధాల బలమైన శక్తిగా నిలపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్స్ ని హీరోలుగా కీర్తించారు. కానీ.., దేశంలో తమ ప్రాబల్యం ఎక్కువ అయ్యాక, దేశంపై మొత్తం పట్టు చిక్కాక తాలిబన్స్ తమలోని మరో కోణాన్ని బయట పెట్టారు. దారుణమైన ఇస్లామిక్ రూల్స్ అక్కడ ప్రవేశపెట్టారు. ఆడవారిని ఇంటికే పరిమితం చేశారు. కఠినమైన శిక్షలు విధించారు. ప్రజల కష్టాన్ని దోచుకోవడం మొదలు పెట్టారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పెంచారు. మొత్తంగా దేశంలో యుద్ధం లేకుండానే ప్రజలకి శాంతి లేకుండా చేశారు.
2001..సెప్టెంబర్ 11న బిన్ లాడెన్ అమెరికాపై చేసిన దాడులు ఆఫ్ఘనిస్థాన్ తలరాతని మార్చేశాయి. ఈ దాడులు తరువాత లాడెన్ తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో తల దాచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా.. ఆఫ్ఘానిస్తాన్ లోని ఆల్ ఖైదా స్థావరాలపై బాంబ్ ల వర్షం కురిపించింది. లాడెన్ కి సహకరించిన తాలిబన్స్ ని తరిమి తరిమి కొట్టింది. ప్రపంచంలోని అన్ని తీవ్రవాద సంస్థలపై పోరు ప్రకటించి, ఆఫ్ఘనిస్థాన్ లో సుస్థిర పాలన కోసం తమ సైన్యాన్ని ఆ దేశంలో ఉంచింది. అమెరికా బలాన్ని ఎదుర్కోవడం తాలిబన్స్ కి తలకి మించిన భారం అయ్యింది. చివరికి అమెరికా కారణంగానే మళ్ళీ ఆఫ్ఘానిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.
హమీదు కర్జాయి తాత్కాలిక అధ్యక్షుడుగా 2003లో వీరి రాజ్యాంగం ఆమోదించబడింది. 2004 ఎన్నికలలో హమీదు కర్జాయియే ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 2005 లో ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఏర్పాటు అయ్యింది. అయినా.., అమెరికా సైన్యాలు మాత్రం ఆఫ్ఘనిస్థాన్ లోనే ఉండిపోయాయి. దీంతో.., సుమారు 20 ఏళ్ళ పాటు తాలిబన్స్ అధికారానికి దూరం అయ్యారు.
ప్రజా ప్రభుత్వాలు ఉన్న చివరి ఈ 15 సంవత్సరాల కాలంలో ఆఫ్ఘనిస్థాన్ చాలా రంగాల్లో మెరుగు పడింది. ఉదాహరణకి క్రికెట్ నే తీసికోండి. అసలు సరిగ్గా ఆట కూడా తెలియని ఆ దేశం.., ఇప్పుడు బలమైన జట్టుగా కనిపిస్తోంది. రషీద్ ఖాన్, మహ్మద్ నబి వంటి స్టార్స్ పుట్టుకొచ్చారు. ఇలా ఒక్క క్రికెట్ మాత్రమే కాదు, చాలా రంగాల్లో ఆఫ్ఘానిస్తాన్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. కొన్ని రంగాల్లో సక్సెస్ అయ్యింది కూడా. కానీ.., తమకంటూ ఒక సుస్థిరమైన సైనిక వ్యవస్థని సిద్ధం చేసుకోవడంలో మాత్రం ఆఫ్ఘనిస్థాన్ విఫలం అయ్యింది. ఇదే సమయంలో తాలిబన్స్ ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ లో బలపడుతూ వచ్చారు. మాదక ద్రవ్యాల బిజినెస్ లో లక్షల కోట్లు సంపాదించి.., ఆర్ధికంగా కూడా బలపడ్డారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ ఉత్తరభాగంలో వీరు అమెరికా దళాలని కూడా ఎదిరించే స్థితికి చేరుకున్నారు.
15 ఏళ్ళ పాటు ఆఫ్ఘనిస్థాన్ లోని పెట్రోల్ నిల్వలను అప్పనంగా వాడుకున్న పెద్దన్న దేశం అమెరికా.., అక్కడ నిల్వలు అయిపోయే సరికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఇక ఆఫ్ఘానిస్తాన్ లో తమ సైన్యం ఉండటం ఆర్ధికంగా తమకి లాభదాయకం కాదని అర్ధం చేసుకున్నాక, ఒప్పందం పేరుతో తమ బలగాలను వెనక్కి రప్పించింది. ఎప్పుడైతే అమెరికా బలగాలు ఆఫ్ఘానిస్తాన్ రక్షణ నుండి తప్పుకున్నాయో.., అప్పుడే మళ్ళీ తాలిబన్స్ ఆక్రమణ మొదలు పెట్టారు. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ నుండి మొదలు పెట్టి.., దేశ రాజధాని కాబూల్ వరకు ఆక్రమించేసుకున్నారు. వీరి దెబ్బకి ఆ దేశ ప్రధాని అష్రాఫ్ ఘనీ ఏకంగా దేశం నుండి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా ఇప్పుడు మొత్తం ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్స్ చేతికి వచ్చేసింది.
తాలిబన్స్.. ప్రజలు ఎవ్వరినీ దేశం విడిచి పొమ్మని ఇబ్బంది పెట్టడం లేదు. కాకుంటే వారి నిరంకుశ, నియంత పాలన చాలా దారుణంగా ఉంటుంది. చిన్న తప్పులకే తలలు నరికేసే శిక్షలు ఉంటాయి. మహిళల పట్ల దారుణమైన వివక్ష ఉంటుంది. పైగా.., ప్రజలపై పన్ను భారం ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. తాలిబన్స్ పాలనలో సామాన్య ప్రజల ప్రాణాలు ఎప్పుడైనా పోవచ్చు. వారి పరిపాలన అంత దారుణంగా ఉంటుంది. ఇందుకే ఆ దేశ ప్రజలు.. బయట దేశాలకి వలస పోవడానికి ఇప్పుడు ఎయిర్ పోర్ట్స్ లో క్యూలు కడుతున్నారు.
నిజానికి ఇప్పటికిపుడు అయితే.. ఆఫ్ఘనిస్థాన్ ప్రజల ప్రాణాలకి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. కానీ.., వారు మాత్రం ఇక నుండి పూర్తి స్వేచ్చని కోల్పోయినట్టే. ఒకవేళ తాలిబన్స్ దేశ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేస్తే.., ప్రపంచ దేశాలు సైతం ఎప్పటికైనా తాలిబన్స్ రూలింగ్ ని అంగీకరించాల్సిందే. వారితో దౌత్య సంబంధాలను కొనసాగించాల్సిందే. కానీ.., వీరు గనుక ప్రపంచ శాంతికి అడ్డంకిగా మారి, ఆఫ్ఘనిస్థాన్ అలజడికి తెర లేపితే మళ్ళీ అగ్ర రాజ్యాలు కల్పించుకోక తప్పదు. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ ఎప్పటికైనా ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజా ప్రభత్వం ఏర్పడక తప్పదు. ఇదీ ఆఫ్ఘానిస్తాన్ చరిత్ర. రాచరిక వ్యవస్థ, అంతర్గత కుమ్ములాట, తమ అంతర్గత వ్యవహారాల్లోకి పక్క దేశాలను ఆహ్వానించడం, సరైన సైనిక వ్యవస్థని ఏర్పాటు చేసుకోకపోవడం.. ఇవన్నీ ఆఫ్ఘానిస్తాన్ పతనానికి కారణం ఆయాయ్యి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.