ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ప్రస్తుతం ఇండియాతో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విమర్శలకి కారణం అవుతుంది. మొన్నటి మొన్న ఫేస్ బుక్, ట్విట్టర్ భారత్ పెట్టిన కండీషన్స్ కి తలొగ్గకుండా తోక జాడించాలని చూశాయి. ఆ ప్రయత్నం సఫలం కాక.., ఎక్కడ తమ ప్లాట్ ఫామ్స్ భారత్ లో బంద్ అవుతాయేమో అన్న భయంతో ఇండియా పెట్టిన కండీషన్స్ కి తలొగ్గాయి. ఇక ఇప్పుడు టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మరోసారి ఇలాంటి తలతిక్క నిర్ణయంతో మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ట్విట్టర్ ఖాతాని కలిగి ఉన్న వారిలో కొంతమందికి బ్లూ టిక్ ఉంటుంది. ఇలా బ్లూ టిక్ ఉంటే అది అఫీషయల్ అకౌంట్ అని అర్ధం. ఇలాంటి ప్రొఫైల్ నుండి వచ్చే ట్వీట్స్ విశ్వసించతగ్గవని నెటిజన్స్ నమ్ముతారు. కానీ.., ట్విట్టర్ తాజాగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వినియోగిస్తోన్న ఆయన వ్యక్తిగత అకౌంట్కు సంబంధించిన బ్లూ టిక్ను తొలగించింది. ఉప రాష్ట్రపతి హోదాలో ఆయన వాడుతోన్న సెక్రటేరియట్ అకౌంట్ బ్లూ బ్యాడ్జిని మాత్రం కొనసాగించింది. ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమయంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను వెంకయ్యనాయుడు తన వ్యక్తిగత ఖాతాలో ట్వీట్ చేస్తుంటారు.
మిగిలిన ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అన్నీ ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్న అకౌంట్ నుండి ట్వీట్ చేయడం ఆయనకి అలవాటు. దీంతో.., సంవత్సర కాలంగా వెంకయ్యనాయుడు వ్యక్తిగత అకౌంట్ లో ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. దీంతో.., ట్విట్టర్ ఆయన వ్యక్థగత అకౌంట్ కి ఉన్న బ్లూ టిక్ ని తొలగించింది. ఒకదేశ ఉప రాష్ట్రపతి అకౌంట్ అని కూడా చూడకుండా ట్విట్టర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు భారత ప్రజల ఆగ్రహానికి గురి అవుతోంది. నిజానికి ట్విట్టర్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ను మొత్తానికే బ్లాక్ చేసి ట్విట్టర్ పెద్ద దుమారాన్నే రేపింది. నిజానికి క్రియాశీలకంగా లేని అకౌంట్లకు వెరిఫైడ్ బ్లూ టిక్ను తొలిగిస్తామని ట్విట్టర్ తన నియమనిబంధనలో ముందుగానే తెలిపింది. కానీ.., సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై భారత ప్రభుత్వం విధిస్తోన్న పలు నిబంధనల నేపథ్యంలోనే ట్విట్టర్ ఇలా వ్యవహరించడం విమర్శలకి తావిచ్చింది. మరి ఈ వివాదంపై ట్విట్టర్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.