మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. తౌక్టే తుపాన్ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్జిసి ఉద్యోగులు ఉన్నారు. వెంటనే రంగంలోకి దిగన నావికా దళం నౌకలో ఉన్న 185 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా మరో 51 మంది ఆచూకీ కనిపించడం లేదు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా 22 మంది మృతదేహాలను సముద్రంలో నుండి ఒడ్డుకు తీసుకొచ్చారు. తౌక్టే తుపాను నిన్న సాయంత్రం ముంబయి తీర ప్రాంతానికి సమీపం నుండి వెళ్లడంతో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా అలలు ఎగసిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో అలల ఉధృతి గంటకు 180 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ ప్రభావంతో బాంబే హై ప్రాంతంలోని ఓఎన్జీసీ చమురు క్షేత్రం వద్ద పి.305 అనే భారీ నౌకతోపాటు మరో రెండు నౌకలు, ఒక ఆయిల్ రిగ్ లంగరు ఊడిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయాయి.
భారీ ఓడలు సముద్రంలో చిక్కుకుపోయి మునిగిపోయిన ఘటనలో నేవి సిబ్బంది యుద్ధ నౌకలు, హెలీక్యాప్టర్లను రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మరో 65 మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆచూకీ గల్లంతయిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీకి చెందిన ఐదు నౌకలు, హెలీక్యాప్టర్లు ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై తౌక్టే తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తౌక్టే తుపాను ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. తుపాను ప్రభావంతో సముద్రంలో వాతావరణం కఠినంగా ఉండడం వల్ల సహాయక చర్యల్లో ఒకింత ఆలస్యం అవుతోందని పశ్చిమ నావల్ కమాండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చీఫ్ మెహుల్ కర్ణిక్ తెలిపారు. తేగ్, బెత్వా, బియాస్ నౌకలు, పి8ఐ విమానం, సీ హెలికాఫ్లర్లతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని ఆయన చెప్పారు.