హైదరాబాద్- సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో వాహనాదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు.
టీఆర్ఎస్ ప్రీనరీ నేపధ్యంలో సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను పలు మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ మీదుగా వెళ్లే వాహనదారులు అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిందిగా అధికారులు తెలిపారు. కొండాపూర్, ఆర్సీపురం, చందానగర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు, బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్సీయూ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
ఇక హఫీజ్పేట, మియాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు రోలింగ్ హిల్స్, ఐకియా, ఇనార్బిట్ మాల్ నుంచి వెళ్లాల్సిందిగా పోలీసులు సూచించారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ ఇప్పటికే గులాబీ రంగు పూసుకుంది. నగరంలో ఎటు చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తున్నారు.
టీఆర్ ఎస్ ప్లీనరీకి వచ్చే ప్రతినిధులంతా ఉదయం 10 గంటలకే హైటెక్స్ కు చేరుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత 7 తీర్మానాలను చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీఆర్ ఎస్ ప్లీనరీకి మొత్తం 6,500 మంది ప్రతినిధులు హాజరవుతారని, వారందరికీ ప్రాంగణంలోనే భోజన వసతి ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు.