టెక్ డెస్క్- గూగుల్ క్రోమ్.. ప్రపంచమంతా మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్వేర్. విండోస్, ఆండ్రాయిడ్లో బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది వాడేది గూగుల్ క్రోమ్ నే. ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి ఇతర సాఫ్ట్ వేర్ లు ఉన్నా, అవి కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్పైనే ఆధారపడి పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం గూగుల్ క్రోమ్ కు ప్రమాదం వచ్చిపడుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ క్రోమ్ను ఒక బగ్ సాయంతో హ్యాక్ చేయడం వీలవుతుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ బగ్ కోడ్ ను గూగుల్ క్రోమ్ ద్వార హ్యాకర్లు మన మొబైల్స్, కంప్యూటర్స్ వంటి డివైజుల్లోకి ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందని స్వయంగా గూగుల్ కంపెనీ తెలిపింది.
ఈ సెక్యూరిటీ మరుయు సాంకేతిక లోపాన్ని ఇటీవలే గుర్తించినట్లు గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించే వినియోగదారులు వెంటనే తమ క్రోమ్ను అప్డేట్ చేసుకోవాలని గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం వాడుతున్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేయకపోతే హ్యాకర్లు మన ఫోన్, కంప్యూటర్ లో కి బగ్ ను ప్రవేశపెట్టి, మన డేటాను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ బగ్ను హ్యాకర్లు ఇప్పటికే వాడుతున్నట్లు గూగుల్ తన బ్లాగులో పేర్కొంది. మనకు ఏ మాత్రం అనుమానం రాకుండా హ్యాకర్లు మన డేటాను దొంగలిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. హ్యాకర్లు ఇలా దొంగిలించిన డేటాను మిలియన్ డాలర్లకు డార్క్వెబ్లో అమ్ముతున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తింది. అందుకే గూగుల్ క్రోమ్ వాడే ప్రతి ఒక్కరు వెర్షన్ 91.0.4472.164 ఉండేలా చూసుకోవాలని కంపెనీ సూచించింది.