హిందూపురం- ప్రముఖ సినీ నటుడు, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదట. అవును మీరు చదివింది నిజమే. ఈ మాట అంటున్నది మరెవరో కాదు. సాక్షాత్తు హిందూపురం నియోజకవర్గ బీజేపీ నేతలు. బాలకృష్ణతో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని బీజేపీ నేతలంటున్నారు.
ఈమేరకు స్థానిక బీజేపీ నాయకులు హిందూపురం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. పుట్టపర్తి కేంద్రంగా శ్రీత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ గా హిందూపురంను కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయడంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ విఫలమయ్యారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం జిల్లా సాధన కోసం ప్రజలతో కలిసి పోరాడాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించగానే శ్రీ సత్యసాయి జిల్లాకు హిందుపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా డిమాండ్ చేశారు. ఇక హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించాలని డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. అఖిలపక్ష పార్టీలు హిందూపురం పట్టణ బంద్ పాటించాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు ప్రైవేట్ పాఠశాలలు సైతం సెలవు ప్రకటించాయి.